ఓటీటీ, డిజిటల్ వేదికల ఆగమనంతో సినిమా తాలూకు సృజనాత్మక, వ్యాపార సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి. కొన్నేళ్ల క్రితం వినోదానికి సినిమాకు మించిన ప్రత్యామ్నాయ మాధ్యమం కనిపించేది కాదు. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ సినిమాకు సమాంతరంగా దూసుకుపోతున్నాయి. భాషాంతరాల్ని చెరిపివేస్తూ సార్వజనీన కథాంశాల్ని ఆవిష్కరించే అవకాశం ఉండటంతో అగ్ర తారలు కూడా ఓటీటీల వైపు దృష్టిపెడుతున్నారు. ముఖ్యంగా కథానాయికలు వెబ్సిరీస్లపై మక్కువ పెంచుకుంటున్నారు. నవ్యమైన ఇతివృత్తాల్ని ఎంచుకునే వీలు ఉండటం..బహుభాషా ప్రేక్షకులకు చేరువకావడానికి చక్కటి మార్గం కావడంతో ఓటీటీ వేదికలు కథానాయికల్ని ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. తెలుగు అగ్రనాయికలందరూ ఇప్పుడు వెబ్సిరీస్లలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు.
తెలుగు చిత్రసీమలో దశాబ్దకాలం నుంచి అగ్ర కథానాయికల్లో ఒకరిగా వెలుగొందుతున్న సమంత.. హిందీ ‘ఫ్యామిలీ మెన్-2’ సిరీస్తో దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకుంది. రాజ్-డీకే దర్శకత్వంలో గత ఏడాది విడుదలైన ఈ సిరీస్ ఆమెకు జాతీయస్థాయిలో తిరుగులేని పేరుప్రఖ్యాతుల్ని తెచ్చిపెట్టింది. తమిళ పోరాటయోధురాలు రాజీ పాత్రలో సమంత అభినయం అందరి ప్రశంసలందుకొంది. ‘ఒక్క వెబ్సిరీస్తో నాకు దేశవ్యాప్తంగా కొత్త అభిమానగణం ఏర్పడింది. ఈ స్థాయి గుర్తింపును అస్సలు ఊహించలేదు. ఓటీటీ మాధ్యమం భవిష్యత్తులో మరింత శక్తివంతమవుతుంది’ అంటూ సమంత ఈ సిరీస్ విజయం సందర్భంలో వ్యాఖ్యానించింది. ఆమె మాటలు దక్షిణాది నాయికలు చాలా మంది వెబ్ సిరీస్ల వైపు అడుగులు వేయడానికి స్ఫూర్తినిచ్చాయి. ‘ఫ్యామిలీ మెన్-2’ అపూర్వ విజయంతో రాజ్-డీకే దర్శకద్వయం రూపొందిస్తున్న అంతర్జాతీయ వెబ్సిరీస్ ‘సిటాడెల్’లో సమంత ఎంపికైంది. ఇందులో ఆమె బాలీవుడ్ యువహీరో వరుణ్ధావన్తో కలిసి నటించనుంది. గూఢచారి ఇతివృత్తంతో అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో ఈ సిరీస్ను తెరకెక్కించబోతున్నారని తెలిసింది.
ప్రియమణి ‘భామా కలాపం’
‘ఫ్యామిలీమెన్’ వెబ్సిరీస్లో సుచిత్ర అనే గృహిణి పాత్రలో మెప్పించింది సీనియర్ కథానాయిక ప్రియమణి. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘భామా కలాపం’ అనే వెబ్సిరీస్లో నటిస్తున్నది. ఫిబ్రవరి 11నుంచి ‘ఆహా’ ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. పొరుగింటి విషయాల్ని తెలుసుకోవడానికి ఎప్పుడూ ఆతృత చెందే విచిత్ర మనస్తత్వమున్న అనుపమ అనే మహిళ పాత్రలో ప్రియమణి కనిపించనుంది. గృహిణిగా, యూట్యూబ్ వంటల ఛానల్ నడిపించే మహిళగా ఆమె పాత్ర భిన్న పార్శాల్లో సాగనుంది. అనుపమ నివసించే అపార్ట్మెంట్టో ఓ హత్య జరుగుతుంది. దాని చుట్టూ అల్లుకున్న మిస్టరీ ఏమిటి? ఆ హత్యతో అనుపమకు ఉన్న సంబంధం ఏమిటనే అంశాలతో ఈ సిరీస్ ఆద్యంతం ఉత్కంఠగా ఉంటుందని సిరీస్ షోరన్నర్ భరత్కమ్మ తెలిపారు.
రాశీఖన్నా క్రైమ్ సిరీస్
ప్రయోగాలు చేయడానికి డిజిటల్ వేదికలే ఉత్తమమని అంటున్నది రాశీఖన్నా. ప్రస్తుతం ఆమె ‘ఫ్యామిలీమెన్’ సిరీస్ దర్శకద్వయం రాజ్-డీకే రూపొందిస్తున్న వెబ్సిరీస్లో షాహిద్కపూర్ సరసన నటిస్తున్నది. దీంతో పాటు అజయ్దేవ్గణ్తో కలిసి ‘రుద్ర’ అనే వెబ్సిరీస్లో ముఖ్యపాత్రను పోషిస్తున్నది. క్రైమ్ ఎలిమెంట్స్తో తెరకెక్కించిన ‘రుద్ర’ ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. సినిమాలతో పాటు వెబ్సిరీస్లో నటిస్తూ నటిగా కొత్త ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నానని రాశీఖన్నా ఆనందం వ్యక్తం చేసింది. దాదాపు రెండు దశాబ్దాలుగా దక్షిణాది చిత్రీసీమలో రాణిస్తున్న సీనియర్ నాయిక త్రిష ‘బృందా’ వెబ్సిరీస్ ద్వారా డిజిటల్ ప్లాట్ఫామ్పై అరంగేట్రం చేస్తున్నది. సూర్య వంగాల దర్శకత్వం వహిస్తున్న ఈ తెలుగు వెబ్సిరీస్ ఇటీవలే ప్రారంభోత్సవం జరుపుకుంది. మహిళా ప్రధాన ఇతివృత్తంతో ఈ సిరీస్ను రూపొందిచబోతున్నారని సమాచారం.
రెజీనా ‘రాకెట్బాయ్స్’
తెలుగులో మరో సీనియర్ నాయిక రెజీనా ‘రాకెట్ బాయ్స్’ అనే వెబ్సిరీస్ ద్వారా ఓటీటీలో అరంగేట్రం చేస్తున్నది. భారత అణ్వస్త్ర పితామహుడిగా పేరు పొందిన హోమీ జే బాబా, అంతరిక్ష పరిశోధన పితామహుడిగా ప్రసిద్ధి పొందిన విక్రం సారాభాయ్ జీవిత కథల ఆధారంగా ఈ సిరీస్ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో విక్రం సారాభాయ్ భార్య మృణాళిని సారాభాయ్గా రెజీనా కనిపించనుంది. భరతనాట్యం నేపథ్యంలో ఆమె పాత్ర సాగనుంది. ఫిబ్రవరిలో ఈ సిరీస్ స్ట్రీమింగ్కానుంది. ‘ఆర్.ఎక్స్.100’ చిత్రం ద్వారా యువతరానికి చేరువైన పాయల్రాజ్పుత్ ‘త్రీరోజేస్’ వెబ్సిరీస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈషారెబ్బా, పూర్ణ నటించిన ఈ సిరీస్కు మారుతి షో రన్నర్గా వ్యవహరించారు. ఈ సిరీస్కు మంచి ఆదరణ లభించడంతో పాయల్రాజ్పుత్ మరికొన్ని వెబ్సిరీస్లలో నటించనుందని తెలుస్తున్నది.