తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం బషీరాబాద్ రైతులు వినూత్న నిరసన చేపట్టారు. గ్రామంలోని గట్టుపొడిచిన వాగు ప్రాజెక్టు పరిధిలోని 500 ఎకరాల్లో టీఆర్ఎస్ జెండాలు ఎగురవేసి తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ.. వడ్లు కొనబోమంటున్న కేంద్ర ప్రభుత్వ తీరును నిరసించారు.
నమస్తే తెలంగాణ నెట్వర్క్, నవంబర్ 11: యాసంగి వడ్ల కొనుగోళ్లలో కేంద్రం మొండి వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ నిరసన జెండా ఎత్తింది. వానకాలం పంటపై కేం ద్రం తన విధానం స్పష్టంగా ప్రకటించకపోయినా.. రైతు ప్రయోజనాలే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పండిన ప్రతి గింజను కొంటున్నది. యాసంగిలో వరిని పండించవద్దని.. పండించినా తాము కొనేది లేదని కేంద్రం విస్పష్టంగా తేల్చిచెప్పిన నేపథ్యంలో.. యాసంగి ధాన్యం కొనుగోలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు చేయాలని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.
ఈ మేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తం గా ధర్నాలు నిర్వహించడానికి టీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యం లో ఎన్నికల మార్గదర్శకాలకు లోబడి అన్ని జిల్లా కేం ద్రాల్లో కలెక్టర్ల అనుమతి తీసుకొని ధర్నా కార్యక్రమాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర రైతుల మనోభావాలు కేంద్రానికి తెలిసేలా నిరసన కార్యక్రమాన్ని విజయవంతంచేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రె సిడెంట్, పురపాలక, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ పార్టీ శ్రే ణులకు పిలుపునిచ్చారు.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో నిర్వహించే ధర్నా కార్యక్రమం లో మంత్రి కేటీఆర్ పాల్గొంటున్నారు. ఏ జిల్లా మంత్రులు ఆ జిల్లాలో జరిగే ధర్నా కార్యక్రమాల్లో పాల్గొనాలని టీఆర్ఎస్ పార్టీ దిశానిర్దేశం చేసింది. ఏ నియోజకవర్గ కేంద్రంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేతోపాటు మండల, గ్రామ కమిటీల సభ్యులు, పార్టీ అనుబం ధ సంఘాల సభ్యులతోపాటు, రాష్ట్ర నాయకులు, కార్పొరేషన్ల చైర్మన్లు హాజరై రైతులకు బాసటగా నిలవాలని ఆదేశించింది. నియోజకవర్గాల పరిధిలోని రైతులు భారీ ఎత్తు న భాగస్వామ్యం అయ్యేలా చర్యలు తీసుకొన్నారు.
యాసంగి సీజన్లో పండిన ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయరో కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ నేతలను నిలదీయాలని వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం పార్టీశ్రేణులు, అభిమానులు, ప్రజాప్రతినిధులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. శుక్రవారం వనపర్తిలో తలపెట్టిన ధర్నాకు ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా కదిలిరావాలని కోరారు.
రైతుల వడ్లను కేంద్రం కొనుగోలు చేసేవరకు ఉద్యమిస్తామని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హెచ్చరించారు. శుక్ర వారం మేడ్చల్ జిల్లా వ్యాప్తం గా మహాధర్నా నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
ఉద్యమాల పార్టీ టీఆర్ఎస్ రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గురువారం కందుకూరులో మాట్లాడుతూ.. వడ్లు కొనుగోలు చేయాలని కోరుతూ అని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించే ధర్నాలతో నిరసన జ్వాల హస్తినాకు తాకాలని పిలుపు నిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతుల ధాన్యాన్ని ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయడంతో పాటు రైతు వ్యతిరేకచట్టాలను వెనక కు తీసుకొనే వరకు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తామని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. గురువారం హనుమకొండలో మాట్లాడుతూ ప్రజలు బీజేపీ నాయకులు ఉరికించి కొట్టేరోజులు దగ్గరపడ్డాయని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ వానకాలంలో పండిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని ప్రకటించి, కొనుగోలు చేస్తుంటే బీజేపీ మాత్రం కొనడం లేదంటూ ధర్నాలు చేస్తూ రైతులను అయోమయంలోకి నెడుతున్నదని పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ప్రభుత్వం వానకాలం ధా న్యం కొనుగోలు చేయబోమని ఆర్డర్ ఏదైనా ఇచ్చిందా? అని నిలదీశారు. వానకాలం ధాన్యం కొనుగోలు చేయడం లేదన్న ఏ ఒకరైతునైనా చూపిస్తే తానే స్వయంగా బాధ్యత తీసుకొని వడ్లు కొనిపిస్తానని తెలిపారు.
గురువారం కరీంనగర్లోని తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు ధర్నాలు చేసే వేదిక తప్పుగా ఎంచుకున్నారని ఎద్దేవా చేశారు. వారు యాసంగి ధాన్యం కొనాలని ఢిల్లీలో ధర్నాలు చేయాలని సూచించారు. యాసంగి బియ్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని ఎఫ్సీఐ, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్డర్ను బీజేపీ నాయకులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేదంటే వారి ఇండ్ల్ల ముందు రైతులతో కలిసి తాము ధర్నాలు చేయాల్సి వస్తుందని, యాసంగి పంట కొంటామని కేంద్రం పత్రం ఇచ్చేదాకా తాము పోరా టం చేస్తామని పేర్కొన్నారు.