న్యూఢిల్లీ: పెగాసస్ గూఢచర్యం వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం తీర్పు వెలువరించనున్నది. దేశంలోని పలువురు ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసేందుకు ఇజ్రాయెల్ సంస్థ ఎన్ఎస్వోకి చెందిన పెగాసస్ అనే స్పైవేర్ను కేంద్ర ప్రభుత్వం ఉపయోగించిందని గతంలో ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఎడిటర్స్ గిల్డ్తో పాటు సీనియర్ జర్నలిస్టులు ఎన్ రామ్, శశికుమార్ తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన బెంచ్ సెప్టెంబర్ 13న తన తీర్పును రిజర్వు చేసింది. పౌరులపై నిఘాకు పెగాసస్ను అక్రమ పద్ధతిలో ఉపయోగించారా లేదా అనే విషయం మాత్రమే తెలుసుకోవాలని అనుకుంటున్నామని విచారణ సందర్భంగా కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ వ్యవహారంలో దేశ భద్రత దృష్ట్యా సవివరమైన అఫిడవిట్ను దాఖలు చేయలేమని కేంద్రం తెలిపింది.