గురు శక్తి అనంతం.గురు కృప అపారం.తన అనంత శక్తితో, అపారమైన కృపావర్షాన్ని కురిపించిన సద్గురుమూర్తి దత్తాత్రేయుడు. విష్ణు అంశగాజన్మించి సనాతన ధర్మంలో అవధూతసంప్రదాయానికి బాటలు పరిచాడు.దత్తుడిగా, శ్రీపాద శ్రీవల్లభుడిగా, నరసింహ సరస్వతిగా ఏ అవతారంధరించినా లోకోపకారమే పరమావధి.మార్గశిర పౌర్ణమి దత్త జయంతి. ఈ సందర్భంగా సద్గురు లీలలు స్మరించుకుందాం.
అత్రి మహాముని సుపుత్రుల కోసం ఘోర తపస్సు ఆచరిస్తాడు. ఆ తపస్సు ఫలించి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రత్యక్షమవుతారు. ‘మా అంశతో మీకు ముగ్గురు పుత్రులు కలుగుతారు’ అని వరమిస్తారు. ఆ ఫలితంగానే అత్రి, అనసూయ దంపతులకు బ్రహ్మ అంశతో చంద్రుడు, విష్ణు అంశతో దత్తాత్రేయుడు, రుద్రాంశతో దుర్వాసుడు జన్మిస్తారు. అలా మహావిష్ణువు అంశతో జన్మించిన అవతారమూర్తే దత్తాత్రేయుడు. చిన్నప్పటి నుంచి దత్తుడు లోకోత్తరమైన లీలలను ప్రదర్శిస్తూ ఉండేవాడు. అనేక మంది మునీశ్వరులకు అపూర్వమైన యోగవిద్యను ప్రసాదిస్తూ ఉండేవాడు. తల్లి అనసూయా దేవికి కూడా ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించాడు. కపిలుడి అవతారంలో తల్లి దేవహూతికి ఆత్మబోధ చేస్తే, దత్తావతారంలో తల్లి అనసూయకు ఆత్మబోధ చేశాడు. అనంతరం దత్తాత్రేయస్వామి భక్త రక్షణార్థం సహ్యాద్రి గుహల్లో తపస్సు ఆచరించాడు. ఒకానొకప్పుడు చతుర్ముఖ బ్రహ్మ వేదాలను మరచిపోయి దత్తాత్రేయుడిని ఆశ్రయించాడని పురాణాలు చెబుతున్నాయి. అప్పుడు స్వామి బ్రహ్మదేవుడికి వేదదానం చేశాడట. మరొకప్పుడు జంభాసురుడనే రాక్షసుడి పీడన నుంచి దేవతలను దత్తాత్రేయుడే రక్షించాడు.
కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుడి కోసం తపస్సు చేసి వెయ్యి చేతులు, నిత్యయౌవనం వరాలుగా పొందాడు. రావణాసురుడిని జలాపహరణం చేసినందుకు శపించాడనే కథ కూడా పురాణాల్లో కనిపిస్తుంది. అదే విధంగా ప్రహ్లాదుడికి అజగరవ్రతధారి మునిరూపంలో సాక్షాత్కరించి ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. ఇలా అనంత కరుణా సముద్రుడై భక్తులను సతతమూ రక్షించే సనాతన శాశ్వత ఆనందమే శ్రీదత్తాత్రేయ అవతారం. స్వామి ఇహ, పర ఉభయ ఫలప్రదాత. అందుకే ఏడుకొండలపై దీనదయాళుడైన ఆ శ్రీనివాసుడిలో దత్తాత్రేయస్వామిని దర్శించుకుంటూ…. ‘తానె తానె ఇందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి… తనరగ కపిలుడై దత్తాత్రేయుడై.. ఘనమైన మహిమ శ్రీవేంకటరాయడై!…’ అంటూ పదకవితాపితామహుడు అన్నమయ్య నీరాజనాలు అర్పించాడు.
భారతదేశంలో తెలుగు రాష్ర్టాలతోపాటు, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో దత్త సంప్రదాయం విస్తారంగా విరాజిల్లింది. దత్తాత్రేయుల అవతారం పరంపరగా కొనసాగటం విశేషం. దత్తాత్రేయుడి మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు తెలుగు ప్రాంతంలో జన్మించటం మన పుణ్యఫలం. శ్రీపాదుడు ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో ఆవిర్భవించాడు. మానవులలో పేరుకుపోయిన మనోమాలిన్యాలను, పూర్వపాపాల సంచిత కర్మలను తన స్మరణ మాత్రం చేత తొలగించి, ధన్యతను ప్రసాదించే పుణ్యమూర్తి శ్రీవల్లభుడు.
దత్తాత్రేయుని రెండో అవతారం శ్రీనరసింహ సరస్వతి. అంబ అనే భక్తురాలికి కుమారుడుగా జన్మిస్తానని శ్రీపాదులు చేసిన వాగ్దానాన్ని అనుసరించి ఆవిర్భవించిన అవతారమిది. దత్తాత్రేయుని మూడో అవతారం మాణిక్యప్రభువు. వీరి తల్లిదండ్రులు కల్యాణి నగరంలోని మనోహర నాయకుడు, బయాదేవి దంపతులు. దత్తుని మరో రెండు అవతారాలు అక్కల్కోట మహారాజు, శిరిడీ సాయిబాబా. వీరి నుంచి దత్తావతారులు అవధూత మార్గాన్ని అనుసరించటం ఆరంభమైంది. వీరి జననీజనకుల వివరాలు, పుట్టిన తేదీ, ప్రదేశం వంటి వివరాలు అలభ్యం. ఇది దత్తాత్రేయస్వామి అవతారాల లీల. తుదకు వీరి పేర్లు కూడా ఇతరులు పెట్టినవే! ఉదాహరణకు శిరిడీ సాయిబాబా అవతారాన్నే తీసుకుంటే మహారాష్ట్రలోని శిరిడీలో ఒక ముస్లిం వేషధారణతో పెండ్లివారితోపాటు బండి దిగిన వ్యక్తిని చూసి, అక్కడి ఖండోబా ఆలయ పూజారి ‘ఆవో సాయీ’ అని స్వాగతం పలికాడు. ఆ విధంగా సాయిబాబా ఈ లోకానికి పరిచయమయ్యారు.
దత్తాత్రేయ స్వామి ప్రకృతిలోని చరాచరాలను తన గురువులుగా ప్రకటించుకున్నారు. తనకు ఇరవై నాలుగు మంది ప్రధానమైన గురువులు అని అజగర రూపంలో ప్రహ్లాదుడికి ఇలా వివరించాడు…
-మనోజ్ఞ