న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ఇన్వెస్టర్లు ఆసక్తిగా వేచిచూస్తున్న ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఐపీవోకు శరవేగంగా రంగం సిద్దమవుతోంది. ఈ పబ్లిక్ ఆఫర్లో ప్రభుత్వం 5 శాతం వాటాను విక్రయించనున్నట్లు సమాచారం. ఎల్ఐసీలో ప్రభుత్వం వద్ద మొత్తం 632 కోట్ల షేర్లు ఉండగా, అందులో 5 శాతం అంటే.. 31 కోట్ల షేర్లను పబ్లిక్కు ఐపీవోలో విక్రయించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇష్యూలో తాజా షేర్ల జారీ మాత్రం ఉండదని వారు పేర్కొన్నారు. దేశంలో ఇప్పటివరకూ వచ్చిన భారీ పబ్లిక్ ఆఫర్లలో ఇదే అతిపెద్దది అవుతుంది. తొలుత ప్రభుత్వం 10 శాతం వాటా విక్రయించాలని భావించినప్పటికీ, ఇంత భారీ పబ్లిక్ ఇష్యూను దేశీ ఈక్విటీ మార్కెట్ అందిపుచ్చుకోలేదన్న అనుమానాలతో ఐపీవోను రెండు భాగాలుగా జారీచేయాలని నిర్ణయించింది. తొలిదశలో 5 శాతం షేర్లను ఆఫర్లో విక్రయించేందుకు నిర్ణయించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. బుక్ బిల్డింగ్ ప్రక్రియ ద్వారా షేరు ధరను నిర్దారిస్తారు. ఐపీవోను క్లియర్ చేసేందుకు శుక్రవారం ఎల్ఐసీ డైరెక్టర్ల బోర్డ్ సమావేశం జరగనున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే గురువారం జరిగిన ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ బోర్డ్ సమావేశంలో ఎల్ఐసీ పబ్లిక్ ఆఫర్ ప్రతిపాదనను ఆమోదించారు.
డీఆర్హెచ్పీలో వివరాల వెల్లడి
ఎల్ఐసీ పబ్లిక్ ఆఫర్కు సంబంధించిన డ్రాఫ్ట్ రెడ్హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీహెచ్ఆర్పీ)ను ఫిబ్రవరి 11న మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి సమర్పించనున్నట్లు ఇష్యూ వ్యవహారాలు చూస్తున్న వర్గాలు తెలిపాయి. సంస్థ ఎంటర్ప్రైజ్ విలువ (ఈవీ), ఐపీవోలో ఎంత వాటాను విక్రయించేదీ తదితర వివరాల్ని డీహెచ్ఆర్పీలో వెల్లడిస్తారు. ఈ బీమా దిగ్గజానికి 203 బిలియన్ డాలర్ల విలువను (దాదాపు రూ. 15 లక్షల కోట్లు) ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు బ్లూంబర్గ్ ఇటీవల తెలిపింది. ఇదే జరిగితే అధిక మార్కెట్ విలువ కలిగిన దేశీ కంపెనీల్లో ఎల్ఐసీ ద్వితీయస్థానంలో ఉంటుంది.