వన్డే ఫార్మాట్లో సంపూర్ణ ఆధిపత్యంతో సిరీస్ చేజిక్కించుకున్న టీమ్ఇండియా ఇక పొట్టి పోరుకు సిద్ధమైంది. ఈ ఏడాది ఆఖర్లో ఆసీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే జట్టు కూర్పుపై దృష్టి పెట్టింది. మరోవైపు ఐపీఎల్లో అనూహ్య జాక్పాట్లు కొట్టిన విండీస్ ఆటగాళ్లు.. తమకు అచ్చొచ్చిన ఫార్మాట్లో టీమ్ఇండియాపై ఆధిపత్యం చెలాయించేందుకు రెడీ అవుతున్నారు. ముంబై ఇండియన్స్కు మూల స్తంభాలైన రోహిత్ శర్మ, కీరన్ పొలార్డ్ మధ్య ఆసక్తికర పోరు ఖాయంగా కనిపిస్తున్నది!
కోల్కతా: రెగ్యులర్ కెప్టెన్గా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆడిన తొలి సిరీస్లోనే విజయం సాధించిన రోహిత్ శర్మ.. ఇదే జోరులో వెస్టిండీస్ను మరోసారి దెబ్బకొట్టాలని చూస్తున్నాడు. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య బుధవారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్లో తొలి పోరు జరుగనుంది. లోకేశ్ రాహుల్ సిరీస్కు దూరమైనా.. ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ రూపంలో ఇద్దరు ఓపెనర్లు అందుబాటులో ఉండటంతో టీమ్ఇండియాకు పెద్దగా ఇబ్బంది లేకుండా పోయింది. రోహిత్, కోహ్లీ, ఇషాన్, సూర్యకుమార్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ రూపంలో బలమైన టాపార్డర్ అందుబాటులో ఉండగా.. దీపక్ హుడా, వెంకటేశ్ అయ్యర్లో ఎవరిని జట్టులోకి తీసుకుంటారో చూడాలి. ప్రయోగాలు అనే పెద్ద పదాలు వాడబోమని ఇప్పటికే స్పష్టం చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ.. యువకులు నిలదొక్కుకునేందుకు తగినన్ని అవకాశాలిస్తామని స్పష్టం చేశాడు. మరోవైపు తాజా ఐపీఎల్లో కోట్లు కొల్లగొట్టిన వెస్టిండీస్ ఆటగాళ్లు ఫుల్ జోష్లో ఉన్నారు. అందరికంటే ఎక్కువగా రూ. 10.75 కోట్లు దక్కించుకున్న నికోలస్ పూరన్.. ఆ ఆనందంలో సహచరులకు పిజ్జా ట్రీట్ ఇచ్చినట్లు సమాచారం. పొట్టి ఫార్మాట్లో ఏ క్షణాన్నైనా మ్యాచ్ను మలుపు తిప్పగల ఆటగాళ్లు ఉండటం విండీస్కు కలిసొచ్చే అంశం. మయేర్స్, కింగ్, పూరన్, పొలార్డ్, పావెల్, హోల్డర్, షెఫర్డ్ తమదైన రోజు విధ్వంసం సృష్టించగలరు. వన్డే సిరీస్లో కరీబియన్ల నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదుర్కొని రోహిత్ సేనకు.. తొలి టీ20లో జట్టు ఎంపిక పెద్ద పరీక్ష కానుంది. నాణ్యమైన ఆటగాళ్లు అందుబాటులో ఉండటంతో వారిలో మేనేజ్మెంట్ ఎవరికి ఓటేస్తుందో చూడాలి!
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), ఇషాన్, కోహ్లీ, పంత్, సూర్యకుమార్, శ్రేయస్, హర్షల్, కుల్దీప్, సిరాజ్, చాహల్, అవేశ్ ఖాన్.
వెస్టిండీస్: పొలార్డ్ (కెప్టెన్), మయేర్స్, బ్రాండన్ కింగ్, పూరన్, పావెల్, హోల్డర్, షెఫర్డ్, అలెన్, ఓడెన్, అకీల్, కాట్రెల్
పిచ్, వాతావరణం
పేస్, బౌన్స్కు సహకరించే పిచ్ను సిద్ధం చేసినట్లు సమాచారం. రెండో ఇన్నింగ్స్లో మంచు ప్రభావం చూపొచ్చు. టాస్ కీలకం కానుంది.
2 పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగుల జాబితాలో విరాట్ కోహ్లీ (3227) రెండో స్థానంలో ఉన్నాడు. గప్టిల్ (3299) టాప్లో ఉండగా.. రోహిత్ శర్మ (3197) మూడో ప్లేస్లో
కొనసాగుతున్నాడు.
10-6 భారత్, వెస్టిండీస్ మధ్య ఇప్పటి వరకు 17 టీ20 మ్యాచ్లు జరుగగా.. అందులో టీమ్ఇండియా పదింట విజయం సాధించి ఆరింట ఓడింది. ఓ మ్యాచ్లో ఫలితం తేలలేదు.