హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సమితి కీలక సమావేశం శుక్రవారం తెలంగాణభవన్లో జరుగనుంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన మధ్యా హ్నం రెండు గంటలకు జరుగనున్న ఈ భేటీలో మం త్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతుబంధు సమితి జిల్లా కమిటీ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లతోపాటు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు ఇటీవల ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధుపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం.
వరి కొనుగోళ్ల విషయంలో కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షాపూరిత వైఖరి, టీఆర్ఎస్పై బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న విష ప్రచారంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం ఒక మాట, రాష్ట్ర బీజేపీ నేతలు మరోమాట మాట్లాడుతూ రైతులను అయోమయానికి గురిచేస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ రైతులను కాపాడుకోవటానికి పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహంపై ఓ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తున్నది. మరోవైపు పార్టీ సంస్థాగత నిర్మాణం, జిల్లా పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలు, అన్ని స్థాయిల శ్రేణులకు శిక్షణా తరగతుల నిర్వహణ వంటి అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.
సీఎం జనగామ పర్యటనపై మంత్రుల సమీక్ష
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జిల్లాల పర్యటనలో భాగంగా ఈ నెల 20న జనగామ జిల్లాకు రానున్నారు. జిల్లా కలెక్టరేట్ను ప్రారంభించడంతోపాటు, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించేందుకు గురువారం హైదరాబాద్లోని మంత్రుల నివాస ప్రాంగణంలోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నివాసంలో మంత్రి సత్యవతి రాథోడ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, పార్టీ నేతలు ఎడవెల్లి కృష్ణారెడ్డి, సంపత్, రాజేశ్వర్రెడ్డి తదితరులు సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ పర్యటనకు అధికారులు అన్ని విధాలా ఏర్పాట్లుచేయాలని ఆదేశించారు. జిల్లాకు సంబంధించి కొత్తగా చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రతిపాదనలు రూపొందించాలని చెప్పారు. పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్న సందర్భంగా నిర్వహించనున్న సభా కార్యక్రమానికి మండలాల వారీగా ఇన్చార్జీలకు బాధ్యతలు అప్పగించారు.