కరీంనగర్ : ఒకప్పుడు సర్కారు దవాఖానకు పోవాలంటే నేను రాను బిడ్డో..అని పాడుకునేది. కానీ దవాఖానాల్లో వసతులు పెరగడంతో పాటు కేసీఆర్ కిట్ తో పోదాం పావే బిడ్డో అని సంబురపడుతున్నారని ఆర్థికశాఖమంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని కొత్త వ్యవసాయ మార్కెట్ ఆవరణలో జరిగిన స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మాజీమంత్రి పెద్దిరెడ్డి, కౌశిక్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావులతో కలిసి ఆయన మహిళ సంఘాలకు రూ. 2 కోట్ల 13 లక్షల 48 వేల చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి మిగతా గ్రూపులకు రూ. కోటి 50 లక్షలను కూడా బతుకమ్మ పండుగ లోపు అందజేస్తామన్నారు.
పేదింటి ఆడపిల్ల పెళ్లి కోసం కళ్యాణలక్ష్మీ పధకం ప్రవేశపెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. రూ. 50 వేలతో కళ్యాణ లక్ష్మీ పథకం ఎస్సీలతో ప్రారంభించి.. ఇవాళ అన్ని వర్గాల పేదలకు రూ. లక్షా 116 ఇస్తున్నామని తెలిపారు. 200 రూపాయలున్న ఆసరా పెన్సన్ను 2016 చేశామన్నారు. రాబోయే రోజుల్లో 57 ఏండ్లు నిండిన 4 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వనున్నామన్నారు. ఆసరా పెన్సన్ తో వృద్ధులకు భరోసా దొరికితే…కొడలుకు అత్తే ఆసరా అయిందని, వృద్ధులు, వితంతువుల ఆత్మగౌరవం పెరిగిందని వాళ్ళను ప్రభుత్వం కడుపులో పెట్టుకుని చూసు కుంటోందన్నారు.
రెండెండ్లలో ఇంటింటికి నల్లా పెట్టి మన అక్కాచెల్లెండ్ల బాధ తీర్చినమని హరీశ్రావు అన్నారు. జమ్మికుంటలో మహిళల కోసం కుటీర పరిశ్రమలు ప్రారంభించుకుందాం, దానికోసం ప్రత్యేక కార్యాచరణ తీసుకొస్తామని తెలిపారు. ఢిల్లీలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏమిచ్చిందో ఆలోచించాలని, ధరలను పెంచుతుంది ఎవరో పేద ప్రజలను ఆదుకుంటోంది ఎవరో ఆలోచించాలని మంత్రి కోరారు. తెలంగాణలో ప్రతి మంత్రికి సీఎం కేసీఆర్ 4 వేల ఇండ్లు ఇచ్చారు. పైసా ఖర్చు లేకుండా పేదలను ఇండ్లలోకి పంపించాము.హుజురాబాద్ నియోజకవర్గానికి 5 వేల ఇండ్లు ఇస్తే.. 5 ఇండ్లు అయినా కట్టరా అని ఆయన ప్రశ్నించారు. పెండింగ్ లో ఉన్న ఇండ్లను పూర్తి చేస్తామని, జాగా ఉన్న వాళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ వచ్చాక లక్షా30 వేల ఉద్యోగాలు ఇచ్చాము.. మరో 50-60 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని తెలిపారు. జమ్మికుంట అభివృద్ధికి రూ. 35 కోట్లు ఇచ్చాము.. ఇతర పనులకు కూడా నిధులు ఇచ్చుకుందామన్నారు.నాయిని చెరువును సుందరంగా తీర్చిదిద్దుతాం.వ్యక్తికి లాభం జరిగితే మనం నష్టపోతాం.. పని చేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అని హరీశ్రావు కోరారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను, అన్ని రంగాలను అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ పని చేస్తున్నారు. ఎం కేసీఆర్ మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ఇంటింటికి మంచినీరు అందిస్తున్నారు. ఒకప్పుడు గోదావరి నీళ్లు కావాలంటే గోదావరి దగ్గరికి వెళ్లాల్సి వచ్చేది.. ఇప్పుడు గోదావరిని ఇళ్ల వద్దకు తాగునీటి కోసం తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ ది అన్నారు.
పావలా వడ్డీగా ఉన్న రుణాలను.. వడ్డీలేని రుణాలుగా అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుంది. అన్నారు. స్వయం సహాయక సంఘాలు తయారుచేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించే విధంగా కృషి చేస్తున్నాం.. దాంతో స్వయం సహాయక సంఘాలు ఆర్ధికంగా బలోపేతం అవుతాయి అని మంత్రి అన్నారు.స్వయం సహాయక సంఘా లకు ఇచ్చే రుణాలను ఆర్థికంగా వృద్ధి చెందడానికి ఉపయోగించాలి కానీ.. ఇతర అవసరాలకు వాడకూడదు అని కోరారు.