BJP candidates: భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఆరు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రస్తుతం ఉన్న నలుగురు సిట్టింగ్ ఎంపీల్లో ముగ్గురికి మళ్లీ సీట్లు ఖరారయ్యాయి. మరో సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు పేరును బీజేపీ అధిష్ఠానం తొలి జాబితాలో ప్రకటించలేదు. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ స్థానాలకుగాను 6 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ మరో 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
ప్రస్తుతం ప్రకటించిన ఆరుగురు అభ్యర్థుల్లో కిషన్రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ముగ్గురికి మళ్లీ వారి సిట్టింగ్ స్థానాలనే బీజేపీ హైకమాండ్ కేటాయించింది. కిషన్రెడ్డి సికింద్రాబాద్ నుంచి, బండి సంజయ్ కరీంనగర్ నుంచి, ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీలుగా బరిలో దిగనున్నారు. వారితోపాటు కొండా విశ్వేశ్వర్రెడ్డి చేవెళ్ల నుంచి, డాక్టర్ వెంకటేశ్వరరావు ఖమ్మం నుంచి, బూర నర్సయ్య గౌడ్ భువనగిరి నుంచి బీజేపీ అభ్యర్థులుగా ఖరారయ్యారు.
కాగా, తెలంగాణలోని మొత్తం 17 లోక్సభ స్థానాల్లో 16 స్థానాలు గెలువాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగా గెలుపుగుర్రాలకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఆ మేరకు ఇవాళ ఆరుగురు అభ్యర్థులతో తొలి జాబితాను వెల్లడించింది. వీరితోపాటు ఆదిలాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు, మహబూబ్నగర్ నుంచి డీకే అరుణకు, మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్కు ఎంపీ టికెట్లు ఇవ్వాలని బీజేపీ నిర్ణయించినట్లు సమాచారం. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీచేసి ఓడిపోయిన రఘునందనరావుకు కూడా మెదక్ ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.