ఖైరతాబాద్, జనవరి 24: నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో హైదరాబాద్ మహా నగర పరిధిలో 111 ప్రాంతాల్లో చేపట్టిన డబుల్ బెడ్రూం గృహాల నిర్మాణాలు యజ్ఞంలా కొనసాగుతున్నాయి. ఇటీవల స్పెయిన్ దేశంలోని బార్సిలోనాలో జరిగిన స్మార్ట్ సిటీ ఎక్స్పో వరల్డ్ కాంగ్రెస్లో ప్రపంచ స్థాయిలో తెలంగాణ డబుల్ గృహాల పథకం ఫైనలిస్ట్ అవార్డు పొందిన విషయం తెలిసిందే. ఈ అరుదైన అవార్డును దక్కించుకున్న నేపథ్యంలో రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, హౌజింగ్ ఓఎస్డీ డి.సురేశ్ కుమార్, ఇతర హౌజింగ్ అధికారులను అభినందించారు.
210 మంది లబ్ధిదారులు
ఖైరతాబాద్లోని ఇందిరానగర్లో రూ.17.85 కోట్ల వ్యయంతో నిర్మించిన 210 ఇండ్లలో లబ్ధిదారులు త్వరలోనే గృహ ప్రవేశాలు చేయనున్నారు. సిల్ట్ + 5 అంతస్తులతో నాలుగు బ్లాకుల్లో 2,556 గజాలలో నిర్మాణమైన ఈ గృహాలు సకల హంగులు సంతరించుకున్నాయి. సీసీ రోడ్డు, తాగునీరు, డ్రైనేజీ, లిఫ్టులు, షాపింగ్ కాంప్లెక్సులు, పచ్చని మొక్కలతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు.