కోల్కతా : పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీగా ఖర్చు పెట్టడాన్ని ప్రస్తావిస్తూ రామ రాజ్యం బాగా ఖరీదైన వ్యవహారమని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర శుక్రవారం కాషాయ పార్టీపై మండిపడ్డారు. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రూ 340 కోట్లు ఖర్చు చేసిందని, ఇందులో రూ 221 కోట్లు యూపీ అసెంబ్లీ ఎన్నికలకే వెచ్చించిందని అన్నారు.
ఇది ప్రకటించిన ఖర్చు మాత్రమేనని అనధికారికంగా పెద్ద ఎత్తున ఎన్నికలకు ఖర్చు చేశారని ఆమె ట్విట్టర్లో రాసుకొచ్చారు. కాగా మహువ మొయిత్ర ఖరీదైన లూయిన్ విటన్ బ్యాగ్ను వాడతారాని ఆగస్ట్లో టీఎంసీ ఎంపీని బీజేపీ టార్గెట్ చేయగా ఎన్నికల ఖర్చును ఉద్దేశించి మహువ మొయిత్ర కాషాయ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.
భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ రూ 40,000 విలువైన బ్రిటిష్ లగ్జరీ బ్రాండ్ బుర్బెర్రీ టీషర్ట్ ధరించి పేదల కష్టాల గురించి మాట్లాడుతున్నారని బీజేపీ ఎద్దేవా చేయడాన్ని ఆమె ప్రస్తావించారు. బ్యాగులు, టీషర్ట్ల గురంచి మరిచిపోండి..ఖాకీ నిక్కర్ల వల్ల భారతీయులు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారని పరోక్షంగా బీజేపీని ఎండగట్టారు.