కోల్కతా: పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పాలన ముగిసిందని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. బుధవారం కాంటైలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని.. సభకు హాజరైన ఓటర్లను ఉద్దేశించి ప్రసగించారు. బెంగాల్లో టీఎంసీ ఆట ముగిసినట్లేనని, ఇక రాష్ట్రంలో అభివృద్ధి ఆరంభమవుతుందని ఆయన చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ అధికారంలోకి వస్తుందని, బీజేపీ హయాంలో రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుందనే ఉద్దేశంలో ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమబెంగాల్ను అభివృద్ధి పథంలో నడిపించాలనే లక్ష్యానికి బీజేపీ కట్టుబడి ఉన్నదని ప్రధాని హామీ ఇచ్చారు. బెంగాల్ అభివృద్ధి కోసం తాము కష్టపడి పనిచేస్తామని పేర్కొన్నారు. బెంగాలీ ప్రజలు కూడా ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. ఆంఫాన్ తుఫాన్ బాధితుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను మమతాబెనర్జి సర్కారు లూటీ చేసిందని ప్రధాని ఆరోపించారు. ఈ విషయంలో మమతా దీదీకి బాధితులకు సమాధానం చెప్పే మొహం లేదని ఆయన విమర్శించారు.