న్యూఢిల్లీ : ఈ ఏడాది ప్రారంభంలో కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరితో సహా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం, కేరళలో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఆయా ఎన్నికల్లో విజయం కోసం పార్టీలు పోటాపోటీగా పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్లో టీఎంసీ, తమిళనాడు డీఎంకే అత్యధికంగా ఎన్నికల ప్రచారం కోసం ఖర్చు చేసినట్లు ఈసీ పేర్కొంది.
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారం
చేపట్టిన తృణమూల్ కాంగ్రెస్ ప్రచారం కోసం రూ.154.28కోట్లకుపైగా ఖర్చు చేసింది. మరో వైపు తమిళనాడులో అన్నాడీఎంకేను ఓడించి అధికారాన్ని హస్తగతం చేసుకున్న డీఎంకే పార్టీ.. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ఎన్నికలతో కలిసి రూ.114.14కోట్లు ఖర్చు చేసినట్లు ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఈ మేరకు ఆయా పార్టీల ఎన్నికల కమిషన్కు సమర్పించిన వివరాలను పోల్ ప్యానెల్ పబ్లిక్ డొమైన్లో ఉంచింది.
గత అసెంబ్లీ ఎన్నికలకు తమిళనాట అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ పుదుచ్చేరితో కలిపి ప్రచారం కోసం రూ.57.33 కోట్లు ఖర్చు వ్యయం చేసింది. కాంగ్రెస్ పార్టీ అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ల్లో ఎన్నికల్లో రూ.84.93 కోట్లు వెచ్చించింది. నాలుగు రాష్ట్రాలు, యూటీలో సీపీఐ కనీసం రూ.13.19కోట్లు ఖర్చు చేసింది. తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, కాంగ్రెస్ గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు కాగా.. డీఎంకే, ఏఐఏడీఎంకే ప్రాంతీయ పార్టీలు. అయితే, బీజేపీకి సంబంధించిన ఖర్చుల వివరాలు అందుబాటులో లేవు.