పురులియా : ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పురులియా జిల్లాలో జరిగిన బహిరంగసభలో మాట్లాడారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో విరుకుపడ్డారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భారీ అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపించారు. టీఎంసీ అంటే ట్రాన్స్ఫర్ మై కమీషన్ అన్నారు. కమీషన్ ఇస్తేనే టీఎంసీ పార్టీ ఏదైనా పనిచేస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం డీబీటీ తరహాలో పనిచేస్తోందని, డీబీటీ అంటే డైరక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని, తాము నేరుగా ఖాతాల్లో అమౌంట్ను జమ చేస్తున్నామని, కానీ దీదీ నేతృత్వంలోని తృణమూల్ పార్టీ కమీషన్ల అడ్డాగా మారినట్లు ఆరోపించారు. కమీషన్ల కోసం టీఎంసీ రాజకీయాలు చేస్తోందన్నారు. రైతుల అకౌంట్లకు తమ ప్రభుత్వం నేరుగా డబ్బును వేస్తే, ఆ అమౌంట్ ముట్టకుండా చూస్తోందన్నారు. మే 2వ తేదీన బెంగాల్లో బీజేపీ .. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
బెంగాల్ పరిస్థితిని దీదీ అత్యంత దయనీయంగా మార్చేసిందన్నారు. రాష్ట్రంలో నేరస్తులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని విమర్శించారు. క్రైమ్ ఉంది, క్రిమినళ్లు ఉన్నారున, కానీ వాళ్లు ఎవరూ జైళ్లలో లేరని ప్రధాని విమర్శించారు. మాఫియా ఉంది.. ఉగ్రవాదులున్నారు.. కానీ వాళ్లంతా స్వేచ్ఛగా తిరుగుతున్నారన్నారు. సిండికేట్లు ఉన్నాయి, స్కీమ్లు ఉన్నాయి.. కానీ ఎక్కడా విచారణ జరగడంలేదని దీదీపై మోదీ ఫైర్ అయ్యారు. అన్ని రంగాలు అభివృద్ధి చెందితేనే అభివృద్ధి సాధ్యమని, కానీ దీదీ ప్రభుత్వం గత పదేళ్ల నుంచి దళితులు, గిరిజనులు, ఎస్సీ, ఎస్టీలను పట్టించుకోలేదని మోదీ ఆరోపించారు.
దీదీ కాలికి గాయమైనప్పుడు తాను కూడా చింతించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఆమె గాయం త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు ఆయన చెప్పారు. బెంగాలీ ప్రజలు ముందు నుంచి ఒకటి చెబుతున్నారని, లోక్సభ ఎన్నికల్లో టీఎంసీ సగం సీట్లును కోల్పోయిందని, ఈసారి అసెంబ్లీలో ఆ పార్టీ పూర్తిగా కొట్టుకుపోతుందని అన్నారు.