హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): దేశంలోనే మొట్టమొదటి మహిళా పారిశ్రామికవాడ ప్రారంభానికి సిద్ధమైంది. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల పనులు పూర్తవడంతో వచ్చేనెల మొదటి లేదా రెండవ వారంలో ప్రారంభించాలని నిర్ణయించారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) అనుబంధ విభాగం ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో)కు టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో పటాన్చెరులోని సుల్తాన్పూర్లో 50 ఎకరాలు కేటాయించారు. 50 శాతం రాయితీపై స్థలాన్ని కేటాయించడమే కాకుండా.. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలనూ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.
25 కంపెనీలకు ఇక్కడ స్థలాలు కేటాయించారు. రూ.156.43 కోట్ల పెట్టుబడులు రాగా.. 5,445 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఇక ఇప్పటికే మూడు కంపెనీలు ఉత్పత్తిని కూడా ప్రారంభించడం గమనార్హం. మిగిలిన సంస్థలూ నిర్మాణంలో ఉండగా, ఈ ఏడాది డిసెంబర్ నాటికి అన్ని కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించనున్నాయి. ఇక్కడ పూర్తిగా మహిళా పారిశ్రామికవేత్తల పెట్టుబడులకే అవకాశం ఉంటుంది. అలాగే కాలుష్య రహిత సంస్థలే ఏర్పాటవుతున్నాయి. కాగా, దేశంలో మహిళా పారిశ్రామికవాడలున్నా నూరుశాతం మహిళలతో చేపట్టిన ఇండస్ట్రియల్ పార్కు మాత్రం ఇదేనని అధికారవర్గాలు తెలిపాయి.
ఎలక్ట్రానిక్స్, ఎల్ఈడీ, ప్యాకేజింగ్, ఫర్నీచర్, జనరల్ ఇంజినీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, మెడికల్ డివైజెస్, ఆభరణాలు, ఆటోమొబైల్ పనిముట్లు, సిమెంట్ కాంక్రీట్ ప్రీఫ్యాబ్రికేటెడ్ నిర్మాణాలు, ఇన్స్టంట్ దోశ, ఇడ్లీ పిండి తయారీ, తదితర కంపెనీలు ఇందులో ఏర్పాటవుతున్నాయి.
‘దేశవ్యాప్తంగా ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధతో నూరుశాతం మహిళా పారిశ్రామికవేత్తలకే అవకాశాలిస్తూ ఈ పార్కు ఏర్పాటైంది. 50 శాతం రాయితీపై భూములు కేటాయించడమే కాకుండా ప్రభుత్వమే మౌలిక సదుపాయాలను కల్పించింది. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నదే ప్రభుత్వ సంకల్పం. ఇందుకు అనుగుణంగా మాకు ప్రోత్సాహం లభిస్తున్నది. ఇప్పటికే ఈ ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభించాల్సి ఉన్నా.. కరోనా కారణంగా మౌలిక సదుపాయాల కల్పనలో కొంత జాప్యం జరిగింది. ఇప్పుడు ప్రారంభానికి సిద్ధమైంది’
-జోత్స్నా అంగర,
ఫిక్కీ ఎఫ్ఎల్వో జాతీయ కౌన్సిల్ సభ్యురాలు