తిరుపతి : శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక వసంతోత్సవాలు మే 10 నుంచి 12వ తేదీ వరకు జరుగనున్నాయి. మే 11న సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు స్వర్ణ రథంపై శ్రీదేవి(Sridevi), భూదేవి(Budevi) సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు.
ఉత్సవర్లను ఆలయంలోని వసంత మండపానికి తీసుకొచ్చి ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజల్ సేవ, వీధి ఉత్సవం నిర్వహిస్తారని చెప్పారు. తొలి రెండు రోజులు శ్రీవారు ఉభయనాంచారులతో కలిసి వసంతోత్సవం( Vasantostavam)లో పాల్గొంటారని వివరించారు.
చివరి రోజు శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి, సీతాలక్ష్మణ ఆంజనేయస్వామి సమేత రామచంద్రమూర్తి, రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివారి ఉత్సవమూర్తులను వసంత మండపానికి తీసుకొస్తారని వెల్లడించారు.అనంతరం శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం, ఆస్థానం నిర్వహిస్తారని పేర్కొన్నారు. వసంత రుతువులో లభించే పుష్పాలు, ఫలాలను సమర్పించి స్వామివారి దివ్యానుగ్రహం పొందడమే ఈ వసంతోత్సవం అంతరార్థమని అర్చకులు వెల్లడించారు.