తిరుమల : తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ తగ్గింది . శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఐదు కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు (TTD Officials ) వివరించారు. నిన్న స్వామివారిని 71,894 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 25,208 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం (Hundi Income ) రూ.5.40 కోట్లు వచ్చిందన్నారు.
సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా పుష్పపల్లకీ సేవ సోమవారం రాత్రి వైభవంగా జరిగింది.వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన పల్లకీపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. 6 రకాల సంప్రదాయ పుష్పాలు, 6 రకాల కట్ ఫ్లవర్స్ కలిపి మొత్తం ఒక టన్ను పుష్పాలు వినియోగించారు.
ఈరోడ్ కు చెందిన దాత శ్రీ సెంగుట్టవన్ సహకారంతో పల్లకీ పుష్పాలంకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు మూరంశెట్టి రాములు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాధం, ఎస్ఇ-2 జగదీశ్వర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.