వాషింగ్టన్: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గత నాలుగు నెలల నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే టిక్రీ బోర్డర్లో మహిళా రైతులు కూడా ఆ ఆందోళనలో పాల్గొన్నారు. ఆ రైతులు ఉన్న ఫోటోను.. అమెరికాకు చెందిన టైమ్ మ్యాగ్జిన్ తన కవర్ పేజీలో ప్రచురించింది. రైతుల ఉద్యమంలో మహిళలు ముందువరసలో ఉన్నట్లు ఆ ఫోటోకు క్యాప్షన్ కూడా ఇచ్చిందా మ్యాగ్జిన్. మార్చి ఎడిషన్కు సంబంధించిన కవర్ పేజీని రిలీజ్ చేశారు. ఇటీవల టిక్రీ బోర్డర్ వద్ద సుమారు 20 మంది మహిళలు.. రైతు ఆందోళనలో పాల్గొన్నారు. ఇంటికి వెళ్లాలంటూ సుప్రీంకోర్టు అభ్యర్థించినా.. ఆ మహిళా రైతులు ఎలా ఆ నిరసనల్లో పాల్గొన్నారన్న అంశాన్ని టైమ్ మ్యాగ్జిన్ తన కథనంలో రాసుకొచ్చింది. పంజాబ్, హర్యానా, యూపీ రాష్ట్రాలకు చెందిన మహిళా రైతులు ఉద్యమంలో పాల్గొన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.