న్యూయార్క్: ఇప్పుడు మానవజాతి భూమి కాకుండా విశ్వంలో మరెక్కడైనా నివసించవచ్చేమో అని చూస్తోంది. చంద్రుడిపైకి, మార్స్పైకి రోవర్లను పంపిస్తోంది. మన గెలాక్సీ బయట ఉన్న గ్రహాలను కూడా టెలిస్కోపుల సాయంతో చూస్తున్నారు. కానీ తాజాగా ఓ కుట్ర సిద్ధాంతం మాత్రం అసలు ఒకప్పుడు మనుషులు మార్స్పైనే ఉండేవారు. అణు యుద్ధం జరిగిన తర్వాత అందరూ అంతమైపోయారు. అందుకే మార్స్ కూడా ఎరుపు రంగులోకి మారిపోయింది అని ఆ సిద్ధాంతం చెబుతోంది. ఇది ఓ టిక్టాక్ యూజర్ కుట్ర సిద్ధాంతం. అయితే జనాలు దీనిని అంత ఈజీగా తీసిపారేయడం లేదు. ఇప్పటికే ఈ వీడియోకు లక్షల సంఖ్యలో వ్యూస్, కామెంట్స్, లైక్స్, షేర్స్ రావడం విశేషం.
అసలేంటీ సిద్ధాంతం?
ది న్యూస్వీక్ ఈ టిక్టాక్ యూజర్ కుట్ర సిద్ధాంతం గురించి ఆర్టికల్ రాసింది. crackheadjoedirt అనే పేరుతో ఉన్న ఆ టిక్టాక్ యూజర్.. అసలు మార్స్ అనేది ఎరుపు రంగులో ఎందుకు ఉందో వివరిస్తూ తన వీడియోను మొదలుపెట్టాడు. సైంటిస్టులు చెప్పిన విషయాన్ని చెబుతూ.. అరుణ గ్రహంపై ఒకప్పుడు సహజ వనరులు ఉండేవని చెప్పాడు. అసలు ఈ గ్రహం మొదట్లో ఎరుపు రంగులో లేదని, 20 లక్షల ఏళ్ల కిందటే అలా మారిందనీ అన్నాడు. ఈ గ్రహంపై అణు యుద్ధం జరిగింది. భారీగా అణ్వాయుధాలు పేలిన తర్వాత న్యూక్లియర్ వింటర్ వస్తుంది. అంటే అణ్వాయుధాలు పేలడం వల్ల ఏర్పడిన దట్టమైన పొగ సూర్య కిరణాలను గ్రహంపైకి రాకుండా అడ్డుకుంటాయి. దీంతో అక్కడున్న సహజ వనరులు మొత్తం నాశనమయ్యాయి. ఆ దుమ్ముతో గ్రహం కాస్తా ఎరుపు రంగులోకి మారింది అని ఆ టిక్టాక్ యూజర్ చెప్పాడు. ఆ లెక్కన మార్స్పై అన్ని సహజ వనరులు కోల్పోయిన తర్వాత మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము అన్నది అతని వాదన.
ఇది నిజమేనా?
ఆ న్యూస్వీక్ రిపోర్ట్ ప్రకారం ఇందులో ఏమాత్రం నిజం లేదు. నిజానికి న్యూక్లియర్ వింటర్ క్లియర్ అవడానికి వందల కోట్ల సంవత్సరాలు పడుతుంది తప్ప ఆ యూజర్ చెప్పినట్లు మిలియన్ల సంవత్సరాలు సరిపోదు. అంతేకాదు ప్రస్తుతం మార్స్పై ఉన్న నీళ్లు 300 కోట్ల సంవత్సరాల కిందటే వచ్చినట్లుగా చెబుతూ సైన్స్ జర్నల్లో పబ్లిష్ అయిన ఓ అధ్యయనాన్ని కూడా ఈ సందర్భంగా న్యూస్వీక్ ప్రస్తావించింది. ఇక మనుషులు రెండు కాళ్లపై నడిచే సామర్థ్యాన్ని సంపాదించింది 40 లక్షల సంవత్సరాల కిందట అని స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ చెప్పిన విషయాన్ని కూడా న్యూస్వీక్ తెలిపింది.
మరి మార్స్ ఎరుపు రంగులో ఎందుకు?
మార్స్పై ఉన్న ఐరన్ ఆక్సైడ్ కారణంగా అది ఎరుపు రంగులో కనిపిస్తుంది తప్ప న్యూక్లియర్ వ్యర్థాల వల్ల కాదు అని ఆ రిపోర్ట్ స్పష్టం చేసింది. మార్స్పై ఉన్న ఐరన్ ఆక్సైడ్ భూమిపై ఎందుకు లేదు అన్నదానికి కూడా నాసా సైంటిస్టులు సమాధానం చెప్పారు. భూమి కంటే అరుణ గ్రహం చిన్నగా ఉండటం, తక్కువ గురుత్వాకర్షణ శక్తి కారణంగా అక్కడ ఐరన్ ఆక్సైడ్ ఉన్నట్లు నాసా సైంటిస్టులు భావిస్తున్నారు.