Rakul Preet Singh | తమ వివాహ బంధం గురించి భర్త జాకీ భగ్నానీ చేసిన “సిట్యుయేషన్షిప్” వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీయడంతో నటి రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా స్పందించింది. బాలీవుడ్కి ఈ జంట ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన ఒక చిన్న మాటను సందర్భం లేకుండా వాడుతూ.. కేవలం క్లిక్బైట్ హెడ్ లైన్స్ కోసం ప్రచారం చేయడంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జాకీ భగ్నానీ మాట్లాడుతూ.. తాము పెళ్లి చేసుకున్నప్పటికీ ఒక రకమైన ‘సిట్యుయేషన్షిప్’లో ఉన్నామని, ఒకరికొకరు ఎంతో పారదర్శకంగా, స్వేచ్ఛగా ఉంటామని పేర్కొన్నారు. తమ మధ్య ఎంతటి నిజాయతీ ఉందంటే, ఒకవేళ తన మాజీ గర్ల్ఫ్రెండ్ ఫోన్ చేసినా రకుల్ ముందే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతానని ఆయన ఉదాహరణగా వివరించారు.
అయితే ఈ వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో పాటు కొంచెం వివాదానికి దారి తీశాయి. దీంతో ఈ విషయంపై రకుల్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా స్పందిస్తూ.. గంటపాటు సాగిన ఈ సంభాషణలో ఒకే ఒక్క లైన్ను పట్టుకుని తప్పుడు అర్థం వచ్చేలా హెడ్ లైన్స్గా మార్చడం విచారకరమని అన్నారు. మీడియా ప్లాట్ఫారమ్లు వార్తలను సృష్టించేటప్పుడు విషయం యొక్క లోతును మరియు సందర్భాన్ని అర్థం చేసుకోవాలని, క్లిక్బైట్ కోసం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించకూడదని ఆమె సూచించారు. తమ బంధంలోని స్నేహాన్ని, స్వేచ్ఛను ఉద్దేశించి ఆయన ఆ పదాన్ని వాడారే తప్ప, ప్రచారంలో ఉన్నట్లుగా మరొకటి కాదని ఆమె స్పష్టం చేశారు.

Rakul Preeth Singh