ఖానాపురం, నవంబర్ 29 : వరంగల్ జిల్లా ఖానాపురం మండలం పాకాల అడవుల్లో పెద్దపులి సంచరిస్తోంది. కొద్ది రోజులుగా కొత్తగూడెం మహబూబాబాద్ జిల్లాలో తిరుగాడుతున్న పెద్దపులి సోమవారం పాకాల వైపు రావడాన్ని స్థానికులు గమనించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలానికి చెందిన కొందరు వ్యక్తులు సోమవారం తెల్లవారుజామున కూరగాయలు కొనేందుకు నర్సంపేటకు వస్తున్న క్రమంలో పాకాల సంగెం కాల్వ సమీపంలో రోడ్డు దాటుతూ పులిని చూశారు. దీంతో వారు భయాందోళనకు గురై పులి అడవిలోకి వెళ్లే వరకు దూరంగా ఉండి తర్వాత నర్సంపేటకు వెళ్లారు. కాగా సాయంత్రం వేళ కొత్తగూడ మండలం కోనాపురానికి చెందిన అన్నదమ్ములు ననుబోతుల లింగన్న, రాముతో నర్సంపేటకు ద్విచక్రవాహనంపై వచ్చి పనులు ముగించుకుని తిరిగి వెళ్తున్న క్రమంలో సంగెం కాల్వ మూలమలుపు వద్ద అకస్మాత్తుగా పులి ఎదురైంది. పెద్దగా అరుస్తూ వారి వెంటపడడంతో బైక్ను అక్కడే వదిలేసి పరుగు తీశారు. అదే సమయంలో లారీ రావడంతో పులి అడవిలోకి వెళ్లిపోయిందని దీంతో ప్రాణపాయం తప్పిందని వారు తెలిపారు. ఉదయం నుంచి పులి సంగెం కాల్వ సమీపంలోనే తిరుగుతున్న ఆనవాళ్లను పలువురు వాహనదారులు గుర్తించారు. పులి సంచరిస్తున్నదనే విషయం తెలియడంతో అటుగా వెళ్లే ప్రజలు బస్సులు, పెద్దపెద్ద వాహనాల్లోనే వెళ్తున్నారు.