Thungathurthy | తుంగతుర్తి నియోజకవర్గం ఒకప్పుడు హత్యలు, రక్తపాతాలకు నిలయంగా ఉండేది. 2014కు ముందు రెండు దశాబ్దాల్లో దాదాపు వందకుపైగానే హత్యలు జరిగినట్లు తెలుస్తున్నది. బీఆర్ఎస్ సర్కారు ఏర్పడ్డాక నాటి గాయాల్ని ఒక్కొక్కటిగా మాన్పిస్తున్నది. వేల కోట్లతో అభివృద్ధి చేపట్టింది. గోదావరి రాకతో జల దృశ్యాలు సాక్షాత్కరిస్తున్నాయి. ఎమ్మెల్యే గాదరి కిశోర్ చొరవతో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది.
1967లో నియోజకవర్గాల పునర్విభజనతో ఆవిర్భవించిన తుంగతుర్తి అంతకు ముందు సూర్యాపేట నియోజకవర్గంలో భాగంగా ఉండేది. ఇప్పటి వరకు 12సార్లు ఎన్నికలు నిర్వహించగా, కాంగ్రెస్ నాలుగుసార్లు, సీపీఎం మూడుసార్లు, టీడీపీ రెండుసార్లు, స్వతంత్రులు రెండుసార్లు విజయం సాధించగా, రెండు సార్లు బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం నెలకొన్నది. 2014 నుంచి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 6000 కోట్ల అభివృద్ధి జరిగింది. నియోజక వర్గంలో రూ . 59 కోట్లతో 6 చోట్ల చెక్డ్యాంలు నిర్మించారు. తిరుమలగిరి ,మోత్కూర్ మున్సిపాలిటీలుగా మారాయి. తిరుమలగిరి మున్సిపాలిటీలో రూ.67 కోట్లతో అభివృద్ధి పనులు చేశారు. రూ. 7.50 కోట్లతో శాలిగౌరారం ప్రాజెక్టుకు మరమ్మతులు చేశారు. రూ . 5.16కోట్లతో పంచాయతీ భవనాల నిర్మాణం, రూ. 19.40కోట్లతో డబు ల్ బెడ్రూంలు, 44,372 మందికి ఆసరా పింఛన్లు అందించారు. రూ.18 కోట్లతో ఎస్సారెస్పీ కాల్వల ఆధునీకరణ చేశారు. తిరుమలగిరి మాలీపురంలో రూ. 3 కోట్లతో పాలిటెక్నిక్ కళాశాల , సుమారు రూ.6కోట్లలో నూతన వసతి గృహాలు ఏర్పాటయ్యాయి. అర్వపల్లిలో రూ. 5 కోట్లతో లక్ష్మీనర్సింహస్వామి ఆలయ పునర్నిర్మాణం, రూ. 1.55కోట్లతో సబ్ మార్కెట్ యార్డు, రూ. 3 కోట్లతో తుంగతుర్తిలో మార్కెట్యార్డు పనులు, రూ. 232 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణం చేశారు. రూ. 4,80కోట్లతో మోత్కూర్ మినీట్యాంక్బండ్ ఏర్పాటు, 30 పడకల దవాఖాన మంజూరయ్యింది. నూతనకల్లో రూ.110కోట్లతో మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్ , రూ. 310.33 కోట్లతో నియోజకవర్గంలో మిషన్భగీరథ పనులు జరిగాయి. రూ. 2.30 కోట్లతో గ్రామాల్లో తాగునీటి పైపులైన్లు వేశారు. రూ. 18 కోట్లతో గురజాల -మానాయి కుంట బ్రిడ్జిపై రోడ్డు నిర్మించారు. రూ.43 కోట్లతో మద్దిరాల మండలం లో నూతన పీహెచ్సీ మంజూరు అయింది. దళితబంధు కింద తిరుమలగిరి మండలం లో 2223 కుటుంబాలకు రూ.250 కోట్లు సాయం అందింది.
నియోజక వర్గానికి కాళేశ్వరం జలాలు రావడంతో ఈ ప్రాంత మంతా సస్యశ్యామలమయ్యింది. కాల్వల్లో నీరు, నిండు కుండల్లా చెరువులు కనువిందు చేస్తున్నాయి. పచ్చని పంటపొలాలతో కళకళలాడుతున్నది. నియోజకవర్గంలో 2014కు ముందు 18వేల ఎకరాలకు మించి వరి పండకపోగా కాళేశ్వరం జలాల రాకతో 1.12,210 లక్షల ఎకరాలకు మించి సాగులోకి వచ్చాయి. వ్యవసాయ విస్తీర్ణం పెరగడంతో ప్రజలకు చేతినిండా పని దొరుకుతున్నది. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు సొంత గ్రామాలకు వచ్చి ఉపాధిని పొందుతున్నారు.