త్వరలో జారీ చేయనున్న కేంద్రం
హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): రీజినల్ రింగ్ రోడ్ భూసేకరణ పూర్తి కి కేంద్ర ప్రభుత్వం మూడు గెజిట్లు విడుదల చేయనున్నది. నాలుగైదు రోజుల్లో మొదటి గెజిట్, ఆ తరువాత రెండో గెజిట్ విడుదల చేస్తారు. ఉత్తర భాగం ఏ గ్రామం గుండా వెళ్తున్నది, అలైన్మెంట్ ఉన్న గ్రామం ఏ మండలంలో ఉంది తదితర వివరాaతో గ్రామం, మండలం, జిల్లా పేర్లతో మొదటి గెజిట్ విడుదల చేస్తారు. రెండో గెజిట్లో గ్రామం పేరు, ఏ సర్వే నంబర్లో ఎంత భూమిని సేకరిస్తారో తెలియజేస్తారు. సర్వే నంబర్, భూమి యజమాని పేరు కూడా పొందుపరుస్తారు. ఈ గెజిట్లోనే అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. ఆ తరువాత గ్రామసభ నిర్వహిస్తారు. ఏవైనా అభ్యంతరాలు వస్తే వాటిని పరిశీలించి, పరిష్కరిస్తారు. గ్రామసభ ఆమోదం తరువాత వివరాలను జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థకు అప్పగిస్తారు. అనంతరం పూర్తివివరాలతో గ్రామాల వారీగా తుది గెజిట్ విడుదల చేస్తారు. దీని ప్రకారం భూమిని కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించి, భూమిని సేకరించి జాతీయ రహదారుల సంస్థకు అప్పగిస్తారు. ఈ ప్రక్రియ అంతా రెండు నెలల్లో పూర్తిచేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. భూసేకరణకు ఇబ్బందులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.500 కోట్లు కేటాయించింది.