హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): వన్యప్రాణి (సంరక్షణ) చట్టానికి సవరణలు.. రాష్ర్టాల అధికారాలకు గండి కొట్టాలని కేంద్రం చేస్తున్న మరో కుట్ర. కేంద్రం ప్రతిపాదించిన సవరణలతో రాష్ర్టాల్లోని వన్యప్రాణి సంరక్షణ బోర్డులు నిర్వీర్యమవుతాయి. ముఖ్యమంత్రి నేతృత్వంలోని ఈ బోర్డులో 20 మందికి పైగా సభ్యులు ఉంటారు. వీరిలో ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణవేత్తలు, అటవీ, గిరిజన సంక్షేమ విభాగాల ప్రతినిధులు ఉంటారు. సవరణల ప్రకారం ఈ బోర్డు స్థానంలో ఒక స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేస్తారు. దానికి రాష్ట్ర అటవీశాఖ మంత్రి నేతృత్వం వహిస్తూ, పది మంది సభ్యులను నామినేట్ చేసుకోవాలి. ఇక, ఈ సవరణలతో వన్యప్రాణులకు ప్రాణ గండం పొంచి ఉన్నది. బిల్లు ఆమోదం పొందితే కొన్నేండ్లలో దేశం నుంచి ఏనుగులు సహా 41 రకాల పాలిచ్చే జంతువులు, 864 జాతుల పక్షులు, 17 రకాల సరీసృపాలు, ఉభయచరాలు, 58 రకాల కీటకాలు కనుమరుగు కానున్నాయి. వన్యప్రాణులను పరిరక్షించేందుకు ప్రభుత్వం ‘వన్యప్రాణి (సంరక్షణ) చట్టం (డబ్ల్యూఎల్పీఏ)ను 50 ఏండ్ల క్రితం తీసుకొచ్చింది. వన్యప్రాణులను వేటాడకుండా, వాటితో వ్యాపారం చేయకుండా డబ్ల్యూఎల్పీఏ రక్షణ కల్పిస్తున్నది. ఈ చట్టానికి 1982, 1986, 1991, 1993, 2002, 2006, 2013లో సవరణలు చేశారు. తాజాగా (2021)లో చేసిన ప్రతిపాదన అత్యంత విస్తృతమైనదే కాకుండా వన్యప్రాణులతో వ్యాపారం చేసేందుకు, సున్నితమైన ప్రదేశాల్లో వాటిపై సినిమాలు తీసేందుకు అవకాశం కల్పించనున్నది. అంతేకాకుండా దాడిచేసే జంతువుల నియంత్రణను ఎత్తివేయనున్నది.
చట్టానికి తాజాగా ప్రతిపాదించిన సవరణల్లో ‘వర్మిన్(పంటకు హాని చేసే జంతువులు)’గా పేర్కొన్న జంతువులను విశ్లేషించే విభాగం ఏదీ లేదు. అంటే ఏ జాతి జంతువునైనా వేటాడేందుకు కేంద్రం నేరుగా నోటిఫికేషన్ జారీ చేయవచ్చు. ఈ సవరణ వల్ల వన్యప్రాణులు తీవ్రంగా ప్రభావితమవుతాయని విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ అనే సంస్థ తెలిపింది. చట్టంలోని షెడ్యూల్ 2లో పేర్కొన్న కొన్ని జంతువులు ఇప్పటికే అంతరించే దశలో ఉండగా, వాటిని కూడా వర్మిన్గా పేర్కొనే విధంగా సవరణలు ప్రతిపాదించడం ప్రమాదకరమని పేర్కొంది.
ప్రస్తుత చట్టంలోని సెక్షన్ 40, 43 ప్రకారం ప్రజలు వన్యప్రాణి సంరక్షణ విభాగం చీఫ్ వార్డెన్ అనుమతితో ఏనుగులను కొనుగోలు చేసి రవాణా చేయవచ్చు. అయితే వాటిని తిరిగి అమ్మకూడదు, వాటితో వాణిజ్య లావాదేవీలు జరుపకూడదు. ప్రతిపాదిత బిల్లులో ఏనుగులను ఆ సెక్షన్ల నుంచి తొలగించారు. అనగా ఇకపై ఏనుగుల క్రయవిక్రయాలు నిషిద్ధం కాదు. చట్టం అమలులోకి వస్తే ఇప్పటికే అంతరించిపోయే జాతుల్లో ఉన్న ఏనుగులు ఇకపై పూర్తిగా కనుమరుగవుతాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.