వేప పేరు వినగానే మొదటగా వేపపుల్లలతో పండ్లు తోమడం జ్ఞాపకం వస్తుంది. ఔషధ గుణాలున్న చెట్లలో వేపకు అధిక ప్రాధాన్యత ఉంది. చైనా వంటి దేశాలు వేప చెట్టు ప్రాముఖ్యతను గుర్తించి లక్షల మొక్కలు నాటుకుని దాని లాభాలు పొందుతున్నారు. ఆక్సిజన్ ఇచ్చే ప్రధాన వృక్షాల్లో వేప ముందు వరుసలో ఉంటుంది. అలాంటి వేపకు కష్టమొచ్చింది.
పటాన్చెరు/చేర్యాల, డిసెంబర్ 4 : కొంతకాలంగా పటాన్చెరు నియోజకవర్గం, చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి తదితర మండలాల్లో పలు చోట్ల వేప చెట్లు ఎండిపోతున్నాయి. వేప చెట్టు చిగుర్ల నుంచి కొమ్మలు, కాండం అన్ని క్రమం క్రమంగా ఎండిపోతూ కనిపిస్తున్నాయి. ఆకురాలే కాలంగా భావించి ఈ మార్పును ప్రజలు సరిగ్గా గుర్తించడం లేదు. వేపచెట్టుకు డై బ్యాక్ అనే వ్యాధి సోకిందని అధికారులు పేర్కొంటున్నారు. కాదు టీ మస్కిట్ బగ్ అని నిపుణులు చెబుతున్నారు. అధికారులు వేపచెట్లను కాపాడుకునేందుకు నడుం బిగించారు. నిపుణులు సూచించిన మందులు వాడుతున్నారు.
పటాన్చెరు నియోజకవర్గంలోని పటాన్చెరు, జిన్నారం, రామచంద్రాపురం, గుమ్మడిదల, అమీన్పూర్ మండలాల్లో వేపచెట్లు కొద్ది రోజులుగా ఎండిపోతున్నాయి. మొదటగా ఆకులు ఎర్రగా మారి ఎండిపోతున్నాయి. వేపచెట్టుకు భారతీయులకు అవినావభావ సంబంధం ఉంది. ఇంటికొక తులసీ, పెరట్లో వేపచెట్టు అనేది ప్రతిచోట కనిపిస్తుంది. ఆయుర్వేదంలోనూ వేప ఆకులను వాడుతుంటారు. వ్యవసాయ పొలాలు, జనవాసాల మధ్య, రోడ్లపై ఉన్న వేపచెట్లు ఎర్రగా మారుతూ ఆకులు ఎండిపోయి నిర్జీవంగా కనిపిస్తున్నాయి. ఔటర్ రింగురోడ్డున ఉన్న అన్ని గ్రామాల్లో వేపచెట్లు 50శాతం వరకు క్రమం క్రమంగా ఎండిపోతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో పటాన్చెరు, ఆర్సీపురం, భారతీనగర్, అమీన్పూర్ మున్సిపాలిటీలో, తెల్లాపూర్లో, బొల్లారంలో వేపచెట్లు ఎండిపోతున్నాయి. అమీన్పూర్ మండలంలో కృష్టారెడ్డిపేట, సుల్తాన్ఫూర్, గండిగూడ, పటేల్గూడలో, పటాన్చెరు మండలంలో కర్ధనూర్, నందిగామ, భానూర్, ముత్తంగి, చిట్కుల్, ఇస్నాపూర్లో వేపచెట్లు ఎండిపోవడం కనిపిస్తున్నది.
అంతుచిక్కని కారణం..
వేపచెట్లు ఎండుతుండడం అంతుచిక్కని కారణాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైతే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురువడంతో తేయాకు దోమ (టీ మస్కిటో బగ్) జాతికి చెందిన పెద్దపురుగులు, నల్లి పురుగుల దాడి పెరిగిందని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకులు పేర్కొంటున్నారు. పామాప్సిస్ ఆజాడిరెక్టి అనే శిలీంద్రం వేపచెట్లపై దాడి చేస్తున్నది. గాలి ద్వారా సోకే ఓ రకం బ్యాక్టీరియా కూడా సోకుతుందని భావిస్తున్నారు. వీటివల్ల వేప చిగుర్లు ఎర్రగా మారి ఎండిపోతున్నాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. చీడపీడల నివారణకు కార్బండిజమ్, మ్యాంకోజెబ్ మిశ్రమాన్ని లీటర్ నీటికి 2.5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మందులు పిచికారీ
పటాన్చెరు జీహెచ్ఎంసీ డివిజన్ 113లో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు వేపచెట్లకు శాస్త్రవేత్తలు సూచించిన మందులు చల్లుతున్నారు. ఇప్పటికే పటాన్చెరు పట్టణ పరిధిలో సగానికిపైగా చెట్లకు మందు చల్లారు. వారం రోజులుగా వేపచెట్లకు మందు వేస్తున్నారు. ముఖ్యంగా కాలుష్య గ్రామాలైన పటాన్చెరు నియోజకవర్గంలో వేపచెట్ల నుంచి వచ్చే ఆక్సిజన్ ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఇప్పుడు వేపచెట్ల్లు ఎండిపోతే పరిశ్రమల విషవాయులు ఆరోగ్యాలకు ప్రాణాంతకం కావచ్చని ప్రజలు భావిస్తున్నారు. పటాన్చెరు ఎంపీడీవో కార్యాలయం ముందున్న చెట్లు ఎండిపోతున్నాయి.
పురుగులు వాలడం చూశా..
ఎండిపోయిన వేపచెట్లపై కొద్ది రోజుల క్రితం చీకటిపడే వేళ పురుగులు వాలడం చూశా. విచిత్రమైన శబ్ధంతో వేపచెట్లపై రాత్రంతా ఉంటున్నాయి. ఆ తర్వాత చెట్లు ఎండడం గమనించా. కర్దనూర్తో పాటు పలు గ్రామాల్లో వేపచెట్లు ఎండుతున్నాయి. పరిశోధన చేసి వేపచెట్లకు ఆశిస్తున్న పురుగులను నిలువరించాలి. సంబంధిత శాఖల అధికారులు గ్రామాల్లో, వ్యవసాయ పొలాల్లో పర్యటించి వేపచెట్లను కాపాడేందుకు చర్యలు చేపట్టాలి. పంచాయతీల తరపున వేపచెట్లను రక్షించుకునేందుకు సహకరిస్తాం. హరితహారం, పల్లెప్రకృతి వనంలో వేలాది మొక్కలు నాటి రక్షించుకుంటున్నాం. పెద్ద చెట్లు ఎండిపోతుంటే బాధగా ఉంది.
-వడ్డే కుమార్, ఉప సర్పంచ్ కర్ధనూర్
మందులు పిచికారీ చేయిస్తున్నాం..
పటాన్చెరు డివిజన్ పరిధిలో వేపచెట్లు ఎండుతున్నాయని గ్రహించి జీహెచ్ఎంసీ, అటవీశాఖ అధికారులు, నర్సరీల నిర్వాహకులతో మాట్లాడి వాటిని కాపాడేందుకు కృషి చేస్తున్నా. పరిశోధకులు సూచించిన మందులను భారీ స్ప్రేయర్లు వాడి చెట్లపై పిచికారీ చేయించాను. ఇప్పటికీ చాలా చెట్లు నిర్జీవంగా కనిపిస్తున్నాయి. మేము కొట్టిన మందు ఎంతవరకు సత్ఫలితం ఇస్తుందో చూస్తున్నాం. పట్టణ పరిధిలోని ప్రతి వేపచెట్టును బతికించుకోవాలని పట్టుదలతో ఉన్నాం. వేపచెట్టు ప్రాధాన్యత తెలుసుకాబట్టి వాటిని కాపాడుకుంటాం. పరిశోధకులు సహాయం చేస్తే అన్ని చెట్లను బతికించుకుంటాం.
-మెట్టు కుమార్యాదవ్, కార్పొరేటర్, పటాన్చెరు డివిజన్