టెలి కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పుగా భావిస్తున్న 5జీ సర్వీసులతో విమానాలకు ముప్పు పొంచి ఉన్నదా? 5జీ నెట్వర్క్ విస్తృతంగా అందుబాటులో ఉన్న ప్రాంతంలో విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతాయా? గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఈ వాదనలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
4జీ సేవలకు 10-100 రెట్ల వేగం, సెకనుకు 10 గిగాబిట్ల (1.25 జీబీ) డౌన్లోడ్ సామర్థ్యం కలిగిన అధునాతన 5జీ నెట్వర్క్ సర్వీసులను వచ్చే ఏడాది జనవరి 5న అమెరికాలో అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే, ఈ నూతన సర్వీసులతో విమానాలకు ముప్పు పొంచి ఉన్నదని బోయింగ్, ఎయిర్బస్ సంస్థలు బైడెన్ యంత్రాంగానికి లేఖ రాశాయి. విమానాశ్రయాల దరిదాపుల్లో 5జీ సేవలను పరిమితం చేయాలని, 5జీ అమలును వాయిదా వేయాలని కోరాయి.
మన దేశంలో 5జీ ఎప్పుడు?
వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో దేశంలో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని భావించారు. కరోనా సంక్షోభం, స్పెక్ట్రమ్ ధరల్లో సవరణలతో ఈ ప్రక్రియ ఆలస్యమైంది. 5జీ స్పెక్ట్రమ్ కొత్త ధరలను టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) 2022 మార్చి నాటికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్ (డాట్)కు సమర్పించనున్నట్టు సమాచారం. తర్వాత స్పెక్ట్రమ్ను వేలం వేస్తారు. ఈ ఆక్షన్ ప్రక్రియ 2022 జూలైలో ఉండొచ్చని భావిస్తున్నారు. ఆ తర్వాతే 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి.
విమానాలకు ప్రమాదం ఏమిటి?
ఎయిర్ట్రాఫిక్, విమానాశ్రయాల్లో భారీగా పొగమంచు పేరుకుపోవడం తదితర కారణాల వల్ల పైలట్లు ‘లో విజిబిలిటీ’ (విమానాన్ని ల్యాండ్ చేసే ప్రాంతాన్ని గుర్తించడంలో తడబాటు) సమస్యను ఎదుర్కొంటారు. అయితే దీన్ని అధిగమిస్తూ.. విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేయడానికి కాక్పిట్లో ‘రాడార్ అల్టీమీటర్’ అనే ప్రత్యేక సాధనం ఉంటుంది. ఈ పరికరం సాయంతో భూమి నుంచి విమానం ఎంత ఎత్తులో ఉన్నది? ఎంత వేగంతో కిందికు వాలుగా ప్రయాణిస్తున్నది? తదితర వివరాలను పైలట్ తెలుసుకోవచ్చు. ఈ డివైజ్ 4.2-4.4 గిగా హెర్ట్ ఫ్రీక్వెన్సీ పరిధిలో పనిచేస్తుంది. కాగా, 5జీ సర్వీసులు ఎక్కువ పౌనఃపున్యం రేంజ్లో పనిచేసినప్పటికీ, బేసిక్ 5జీ సేవలను 3.7-3.98 గిగా హెర్ట్ ఫ్రీక్వెన్సీ పరిధిలోనే ప్రసారం చేయబోతున్నారు. దీంతో ‘రాడార్ అల్టీమీటర్’ ఫ్రీక్వెన్సీ, 5జీ నెట్వర్క్ ఫ్రీక్వెన్సీ దాదాపుగా ఒకే పరిధిలో ఉండటంతో ఫ్లైట్ సిగ్నళ్లలో అంతరాయం కలుగుతుందని, దీంతో ఫ్లైట్ ల్యాండింగ్లో ప్రమాదం జరుగొచ్చని బోయింగ్, ఎయిర్బస్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదే జరిగితే పెద్ద మొత్తంలో ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తుందని పేర్కొన్నాయి. అయితే, ఈ వాదనలను సెల్యూలార్ టెలికమ్యూనికేషన్స్ ఇండస్ట్రీ అసోసియేషన్ (సీటీఐఏ) తోసిపుచ్చింది.