కేంద్ర మంత్రి గోయల్గారూ.. ఈ చిత్రాలు చూడండి. తెలంగాణలోని ఎఫ్సీఐ గోదాముల వద్ద పరిస్థితి ఇది. గతంలో ఇచ్చిన ధాన్యాన్ని ఇప్పటివరకు తరలించకపోవడంతో జీరోస్పేస్కు చిరునామాలు ఇవి. జనగామ, కరీంనగర్, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల్లో బుధవారం మధ్యాహ్నం తీసిన ఫొటోలివి. ఎఫ్సీఐ గోదాముల్లో బియ్యం ఉంచేందుకు చోటు లేదు. తరలించేందుకు రైల్వేర్యాకులు అందుబాటులో లేవు. ప్రతి గోదాములో గాలి చొరబడనంతగా, పైకప్పు తాకేలా ఎటుచూసినా బియ్యం బస్తాలే. అదీ చాలక వరండాలో మెట్ల దగ్గర.. అక్కడా జాగ లేక ఆరుబయట టార్పాలిన్లు కప్పి నిల్వలు. ఇక రాష్ట్ర ప్రభుత్వం సేకరించి తీసుకొచ్చిన బియ్యం లారీలు ఎఫ్సీఐ గోదాముల బయటే వరుసకడుతున్నాయి. గత యాసంగికి సంబంధించిన 27 లక్షల టన్నుల బియ్యాన్ని ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని అంటున్న పీయూష్ గోయల్జీ ఇప్పుడు చెప్పండి విఫలమైంది ఎవరో? కేంద్ర ప్రభుత్వమా? రాష్ట్రమా?