అప్పుడే కోర్టుల్లో మహిళా జడ్జీల సంఖ్య పెరుగుతుంది: : సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
న్యూఢిల్లీ, మార్చి 10: న్యాయవిద్యలో మహిళలకు తప్పనిసరిగా రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరమున్నదని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. తద్వారా కోర్టుల్లో మహిళా జడ్జీల సంఖ్య పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. మహిళలకు రిజర్వేషన్ల కారణంగానే తెలంగాణలో 52 శాతం, అస్సాంలో 46 శాతం, ఏపీలో 45 శాతం, ఒడిశాలో 42 శాతం, రాజస్థాన్లో 40 శాతం మంది మహిళలు న్యాయాధికారులుగా విధులు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా జడ్జీల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం సుప్రీంకోర్టులో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. మహిళలకు వారి రిజర్వేషన్ వాటాను ఇచ్చే ప్రక్రియను ఓ విప్లవంగా పరిగణిస్తే, దానికి ఓ విప్లకారుడిగా ప్రచారం చేయడానికి తాను సంతోషిస్తానని, అలాంటి విప్లవాన్ని తాను ఆహ్వానిస్తానన్నారు. సుప్రీంకోర్టు ఆవరణలో ‘సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డు అసోసియేషన్’ (ఎస్సీఏవోఆర్ఏ) కొత్త కార్యాలయాన్ని సీజేఐ జస్టిస్ రమణ ప్రారంభించారు.