హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్, కర్ఫ్యూకి ఆస్కారం లేదని, ఉండదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. మీడియాతో మంత్రి ఈటల మాట్లాడుతూ.. హైదరాబాద్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నట్లు తెలిపారు. అయినా ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. కేసులు పెరుగుతున్నా ఎక్కువ మందిలో లక్షణాలు లేవన్నారు. మరణాల రేటు కూడా తక్కువగానే ఉందన్నారు. ర్యాపిడ్ టెస్టులతో వెంటనే ఫలితం తెలుస్తోందని, పాజిటివ్ వచ్చిన వ్యక్తికి వెంటనే కరోనా కిట్ ఇస్తున్నట్లు చెప్పారు. రిపోర్టు వెంటనే రావడం వల్ల కాంటాక్టు ట్రేసింగ్ సులభమవుతోందన్నారు. టెస్టులను అవసరమైతే లక్ష వరకు పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహిస్తున్నట్లు ఈటల తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో టెస్టులు, వ్యాక్సినేషన్ కొనసాగుతోందన్నారు. ప్రజలకు ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్లూ అందుబాటులో ఉన్నాయన్నారు. మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. హోం ఐసోలేషన్లో ఉన్నవారిని విధిగా మానిటర్ చేస్తున్నట్లు చెప్పారు. హోం ఐసోలేషన్లో ఉన్నవారికి కిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బందిని సమకూర్చుకునేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు.
కరోనా చికిత్సను ప్రైవేటు ఆస్పత్రులు వ్యాపారకోణంలో చూడొద్దని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సామాజిక బాధ్యతగా ప్రైవేటు ఆస్పత్రులూ సేవలు అందించాలన్నారు. కరోనా ఫీజు సాధ్యమైనంత తగ్గించి తీసుకోవాలని కోరారు. సెకండ్ వేవ్ ప్రభావం మరికొంత కాలం ఉంటుందన్నారు. అన్ని ఆస్పత్రిల్లో కొవిడ్, నాన్ కొవిడ్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలు మాస్క్ ధారణ, భౌతికదూరం పాటించడం తప్పనిసరని ఆయన పేర్కొన్నారు.