హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వ్యాప్తంగా 450 మంది ఎంబీబీఎస్ విద్యార్థులను వేర్వేరు కాలేజీల్లో సర్దుబాటు చేసేందుకు వీలుగా సీట్లు ఉన్నాయో లేవో తెలియజేయాలని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ)కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీట్ల రద్దు, ఇతర కాలేజీలకు సర్దుబాటు చేయడం వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని పవన్కుమార్ సహా 49 మంది విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్రశర్మ, జస్టిస్ అభినంద్కుమార్ షావిలి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. సీట్ల సర్దుబాటు సత్వరమే జరిపేలా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది సందీప్రెడ్డి కోరారు. ప్రమాణాలు లేవనే కారణంగా మూడు మెడికల్ కాలేజీల్లో సీట్లను ఎన్ఎంసీ రద్దు చేసిందని,ఆ సీట్లను రెండు కాలేజీలకు మాత్రమే సర్దుబాటు చేయాలని మార్గదర్శకాలు ఇచ్చిందని అన్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ఎన్ఎంసీ న్యాయవాది చెప్పారు. సీట్ల సర్దుబాటు గైడ్లైన్స్ వెలువడతాయన్నారు. విచారణ రెండు వారాలకు వాయిదా పడింది.