హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన వాయుగుండం కారణంగా శ్రీలంక, తమిళనాడు, పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని, తెలంగాణ, ఏపీకి ముప్పు తప్పిందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే మూడ్రోజుల్లో తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తాయని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత స్వల్పంగా తగ్గి, పగటి ఉష్ణోగ్రతలు పెరిగినట్టు వెల్లడించింది.
ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ డబుల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేర్కొన్నది. మంగళవారం అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యూ)లో 10.7 డిగ్రీలు నమోదైన ట్టు వెల్లడించింది. బుధవారం పశ్చిమ, మధ్య తెలంగాణ జిల్లాలతోపాటు హైదరాబాద్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నాడు.