పనాజీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో బీజేపీ మళ్లీ అధికారం నిలబెట్టుకోబోతున్నది. ఆ మూడు రాష్టాల్లో మెజారిటీ స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతూ గెలుపు దిశగా దూసుకుపోతున్నది. ఇక పంజాబ్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యాయి. అక్కడ అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ భారీ మెజారిటీ దిశగా దూసుకుపోతున్నది.
మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకుగాను 80కి పైగా స్థానాల్లో ఆప్ లీడింగ్లో కొనసాగుతున్నది. అయితే మరో రాష్ట్రం గోవాలో మాత్రం కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు నడుస్తున్నది. ఉదయం 11 గంటల సమయానికి రెండు పార్టీలో దాదాపు సమాన స్థానాల్లో లీడింగ్లో ఉన్నాయి. దాంతో రెండు పార్టీలు అప్పుడే క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టాయి. తమ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు చేజారీపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
తమ పార్టీల తరఫున బరిలో నిలిపిన అభ్యర్థులను క్యాంపులకు తరలించి కాపలా కాస్తున్నాయి. గోవాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాగ్రెస్ 17, బీజేపీ 13 స్థానాల్లో గెలిచాయి. కానీ, బీజేపీ తన రాజకీయ చాణక్యాన్ని ఉపయోగించి స్వతంత్రులు, ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈసారి మరింత జాగ్రత్త పడుతోంది. ఇప్పటికే డికే శివకుమార్ తదితర సీనియర్లు గోవాలో తిష్టవేశారు.