వెంగళరావునగర్, డిసెంబర్ 24: పట్టపగలు ఓ ఇంట్లో చొరబడిన దుండగుడు.. .పనిమనిషిపై దాడికి పాల్పడి.. నిర్బంధించి.. రూ. 23 లక్షల సొత్తును దోచుకెళ్లాడు. ఈ ఘటన ఎస్ఆర్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అమీర్పేట ధరంకరం రోడ్డులో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సైదులు కథనం ప్రకారం…అంజనీటవర్స్లో వ్యాపారి వినోద్ తన తల్లిదండ్రులు, భార్య, పిల్లలతో కలిసి ఉంటున్నాడు. గురువారం ఉదయం ఎప్పటిలాగే బాలానగర్లో ఉన్న కార్యాలయానికి వెళ్లాడు. పిల్లలు కూడా అతడితోనే వెళ్లి పోయారు. మధ్యాహ్నం వినోద్ భార్య కోఠిలో జరిగిన శుభకార్యానికి వెళ్లింది. సాయంత్రం వినోద్ తల్లిదండ్రులు బాబులాల్, దేవీ వాకింగ్ చేసేందుకు వెళ్లారు. ఇంటిని శుభ్రం చేసేందుకు వారి వద్ద పనిమనిషి అర్చన తాళాలు తీసుకుంది. వాకింగ్ ముగించుకొని రెండు గంటల తరువాత వచ్చిన వినోద్ తల్లిదండ్రులు ఇంట్లోకి వెళ్లి చూడగా, వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. బెడ్రూమ్లోని బీరువాలో సామగ్రి అంతా కిందపడిపోయి ఉంది. మరోగదికి బయటి నుంచి గొళ్లెం పెట్టి ఉండటంతో తెరిచి చూడగా, పనిమనిషి అపస్మారక స్థితిలో పడిపోయి కనిపించింది. వెంటనే వారు కొడుకు వినోద్కు సమాచారం అందించారు. ఇంట్లోకి చొరబడ్డ దొంగ రూ.17 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల నగదు ఎత్తుకొని పోయినట్లు గుర్తించి.. ఎస్ఆర్నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పనిమనిషి అర్చనను విచారించారు. ఇంట్లోకి వచ్చిన దొంగ తన తలపై బలంగా కొట్టడంతో సృహ తప్పి పడిపోయానని ఆమె తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.