శేరిలింగంపల్లి, డిసెంబర్ 14: మల్టీ బ్రాండ్ లగ్జరీ కార్ల సర్వీస్ సెంటర్లో దొంగతనానికి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.55 లక్షల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు కార్ల సర్వీస్ సెంటర్లోని మెకానిక్ కాగా మరో ఇద్దరు అతడి మిత్రులుగా పోలీసులు గుర్తించారు. యజమాని మరో నూతన షోరూం కోసం నోట్ల కట్టలు సర్వీస్ సెంటర్లోని బీరువాలో దాచడం గమనించిన మెకానిక్ అతడి మిత్రులతో కలిసి దొంగతనానికి పాల్పడ్డాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.
మాదాపూర్లోని 100 అడుగుల రహదారిలో అల్లం శ్రీకాంత్రెడ్డి శ్రీ మోటార్స్ పేరిట మల్టీ బ్రాండ్ లగ్జరీ కార్ల సర్వీస్ సెంటర్ను నిర్వహిస్తున్నాడు.
శ్రీకాంత్రెడ్డి సర్వీస్ సెంటర్లో దాదాపు 35మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో నగరంలోని ఆసిఫ్నగర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ తాహేర్(20) గత నాలుగు సంవత్సరాలుగా శ్రీకాంత్రెడ్డి సర్వీస్ సెంటర్లో కార్ల మెకానిక్గా పనిచేస్తున్నాడు. కాగా బేగంపేట్లో మరో కార్ల సర్వీస్ సెంటర్ బ్రాంచ్ను ఏర్పాటు చేసేందుకు పనులు కొనసాగిస్తున్న అల్లం శ్రీకాంత్ రెడ్డి గత వారం పది రోజులుగా వ్యాపారంలో వచ్చిన డబ్బులను మాదాపూర్లోని సర్వీస్ సెంటర్లో ఉన్న బీరువాలో దాచి పెడుతున్నాడు. రోజు నోట్ల కట్టలను దాచిపెట్టడం గమనించిన మెకానిక్ తాహేర్ సదరు నోట్ల కట్టలను దొంగిలించాలని
నిర్ణయించుకున్నాడు.
తాహేర్ నివసిస్తున్న ఆసిఫ్నగర్ ప్రాంతానికి చెందిన మిత్రులు సయ్యద్ జవాద్(19), సైఫ్ మెయినుద్దీన్లతో కలిసి దొంగతనానికి పథకం రచించాడు. ఈ క్రమంలో ఈనెల 10 తెల్లవారుజామున 3:30 గంటలకు మూసిఉన్న సర్వీస్ సెంటర్ వెనుకభాగంలో ఉన్న డోర్ బోల్టును తొలగించి జవాద్లోనికి ప్రవేశించాడు. తాహేర్, సైఫ్ మొయినుద్దీన్లు బయట ద్విచక్రవాహనంను సిద్ధంగా ఉంచారు. సర్వీస్ సెంటర్ లోపల బీరువా తాళం పగులకొట్టి రూ.55 లక్షల నగదును తీసుకొని బైక్పై పరారయ్యారు.
అనంతరం చోరీ సొత్తును తాహేర్ రూ.20 లక్షలు, జవాద్ రూ.20 లక్షలు, సైఫ్ మొయినుద్దీన్ రూ.15 లక్షలు పంచుకున్నారు. యజమాని శ్రీకాంత్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తును ముమ్మురం చేశారు. సీసీటీవీ పుటేజీలను పరిశీలించడంతో పాటు సర్వీస్ సెంటర్లో అనుమానాస్పదంగా కనిపించిన తాహేర్ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం తన మిత్రులతో కలిసి తానే చేశానని ఒప్పుకున్నాడు. నిందితులు తాహేర్తో పాటు అతడి మిత్రులు జవాద్, సైఫ్ మెయినుద్దీన్లను అదుపులోకి తీసుకొని చోరీ సొత్తు రూ.55 లక్షలను రికవరీ చేశారు. కేసును విజయవంతంగా చేధించిన మాదాపూర్, ఎస్వోటీ పోలీసులను డీసీపీ వెంకటేశ్వర్లు అభినందించారు.