వరి కొనుగోలు కోసం పోరు సాగుతున్నది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నూకలు తినాలన్న వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాపారిని తలపించేలా వ్యవహరిస్తున్న కేంద్ర మంత్రి తీరుపై టీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ధాన్యం కొనుగోలు విషయంలో నిరసన కొనసాగుతుందని హెచ్చరించాయి. తమ ఉసురు పోసుకున్న ప్రభుత్వాలకు మనుగడ లేదని ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు రైతులు హెచ్చరించారు. కాగా ఓవైపు గ్రామ పంచాయతీల్లో తీర్మానాల పరంపర కొనసాగుతున్నది. పంచాయతీల్లో తీర్మానాలు చేసిన ప్రతులను పోస్టుల్లో కేంద్రానికి పంపిస్తున్నారు. వనపర్తి జెడ్పీ సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. వడ్లు కొనే వరకు పోరాటం ఆగదని అల్టిమేటం జారీ చేసింది.
మహబూబ్నగర్, మార్చి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ప్రజలు నూకలు తినాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పీయూష్ మంత్రిలా కాకుండా వ్యాపారిలా, ఛార్టెడ్ అకౌంటెంట్లా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కేంద్రం తీరుకు నిరసనగా ఆందోళన కొనసాగుతున్నది. రైతుల ఉసురుపోసుకున్న సర్కార్లు నిలవలేకపోయానని పేర్కొంటున్నారు. గతంలోనూ తెలంగాణను అవహేళన చేసిన నేతలు కనుమరుగైన విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం తెలంగాణకు ఆది నుంచి అన్యాయమే చేస్తుందని రైతులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనాల్సిందేనంటూ పలు చోట్ల గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపిస్తున్నాయి. వనపర్తి జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి ఆధ్వర్యంలో జెడ్పీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కేంద్రం కచ్చితంగా ధాన్యం కొనుగోలు చేయాలని తీర్మానించారు. ధాన్యం కొనుగోలు చేసే వరకు అలుపెరుగని పోరాటం చేస్తామని జిల్లా అధ్యక్షులు స్పష్టం చేశారు. దేశంలోని వ్యవసాయ పంటలను కొనే బాధ్యత కేంద్రానిదే అని అల్టిమేటం జారీ చేశారు. కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నా.. రాష్ర్టానికి చెందిన బీజేపీ ఎంపీలు కనీసం మోడీకి ఇక్కడి సమస్యను వివరించే ప్రయత్నం చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం తీరు అత్యంత అవమానకరంగా ఉందని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 1 వరకు అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జెడ్పీలలో తీర్మానాలు చేసి ప్రధానికి పంపేందుకు సర్వం సిద్ధమయ్యారు.
కేంద్రం తెలంగాణపై మొదటి నుంచి ని ర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ నేతలు డ్రామా లు చేస్తున్నారు. వారికి రాజకీయాలు తప్పా రైతుల శ్రేయస్సు అవసరం లేదు. కేంద్రం ఏం చెప్తే దానికి భజన చేస్తున్నారు. రైతులకు జరుగుతున్న నష్టాన్ని చూసైనా.. కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత తీసుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు ఢిల్లీకి వెళ్లి విజ్ఞప్తి చేసినా కేంద్రం స్పందించలేదు. ఇక్కడి బీజేపీ నేతలు, ఎంపీలు కేంద్రాన్ని కలిసి ధాన్యం కొనుగోలుపై ఒక్కసారి కూడా విజ్ఞప్తి చేయలేదు. నూకలు తినిపించడం అలవాటు చేయడమనే వ్యాఖ్యలు వారి దిగజారుడుతనానికి నిదర్శనం. ఇలాంటి రాజకీయ నేతలను గతంలో ఎప్పుడూ చూడలేదు. ఇదంతా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. కేంద్రం ధాన్యం కొనే వరకు, రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం.
– డా.సి.లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల ఎమ్మెల్యే
కేంద్రం తీరు ఘోరంగా ఉన్నది. సాక్షా త్తు కేంద్ర మంత్రే తెలంగాణ ప్రజలను నూకలు తినాలనడం అమానుషం. వారి పోకడ చూస్తుంటే తెలంగాణ ప్రజల అభివృద్ధిని ఓర్వలేకపోతున్నారని అర్థమవుతున్నది. రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరుగుతున్నది. కానీ, కేంద్రం మాత్రం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఆగం చేస్తున్నది. కేంద్రమే మద్దతు ధర ప్రకటించి ఇప్పుడు కొనబోమంటే ఎలా. కేవలం ఇక్కడి రైతులపైనే ఇంతటి అమానుషం ఎందుకు..? రైతులు, పేదలకు అండగా నిలబడకుండా ధనవంతులకు కొమ్ముకాస్తున్నది. ధాన్యం కొనే వరకు పోరాడుతాం. అవసరమైతే దేశంలోని అన్ని రాష్ర్టాలకు ఈ సమస్య తెలిసేలా చేస్తాం. ప్రతి పంటకూ మద్దతు ధర ఉండాలే పోరాడుతాం. రైతుకు రాజ్యాంగ పరమైన భద్రత కలగాలి.
– గట్టు యాదవ్, టీఆర్ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు
ధాన్యం కొనుగోలుపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లినప్పుడు నేను కూడా ఉన్నాను. కేంద్ర మంత్రి పీయూష్ కనీసం రైతుల కోణంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు నూకలు తినమంటున్నాడు. నూకలు తింటమో.. మీకు తినిపిస్తమో గ్రామాల్లోకి వచ్చినప్పుడు బీజేపీ నేతలకు తెలుస్తుంది. కేంద్రం సమాఖ్య స్ఫూర్తి లేకుండా వ్యవహరిస్తున్నది. రాజులు, సంస్థానాధీశులను అప్పటి ఆంగ్లేయులైనా గౌరవంగా చూసేవారేమో.. కానీ ప్రజాస్వామ్యయుతంగా ఉన్న రాష్ర్టాలపై కేంద్రం పెత్తనం రోజురోజుకూ పెరిగిపోతున్నది. మోకాళ్ల మీద కూర్చుని అడుక్కునే స్థాయికి రాష్ర్టాలను తీసుకొచ్చారు. దేశాన్ని, జాతిని, ధర్మాన్ని, సినిమాలను, సైన్యాన్ని, పండుగలను, చివరకు కరోనాను కూడా వాడుకునే సమర్థులు బీజేపీ నేతలు. ధాన్యం కొనుగోలు చేయకుంటే జంతర్మంతర్ వద్దకు వెళ్లి పారబోసి తెలంగాణ రైతుల ఆవేదనను ప్రపంచం దృష్టికి తీసుకుపోతాం.