రంగారెడ్డి, నవంబర్ 24 (నమస్తేతెలంగాణ): ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల ఎన్నిక లేకుండా ఏకగ్రీవం కాగా, స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానాలు కూడా అదే పరంపరను కొనసాగిస్తున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో స్థానిక సంస్థల కోటా రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థులు పట్నం మహేందర్రెడ్డి, శంభీపూర్ రాజులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే శుక్రవారం అధికారికంగా ప్రకటించనున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ల ఉపసంహరణ రోజు పోటీలో ఒక్కరు మాత్రమే ఉన్నట్లయితే ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ప్రకటించాల్సి ఉంటుంది. అయితే స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ను తిరస్కరించిన నేపథ్యంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఇద్దరు టీఆర్ఎస్ అభ్యర్థులు బరిలో ఉండడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రేపు ప్రకటించడంతోపాటు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధ్రువీకరణ పత్రాలు అందజేయనున్నారు.
బలపరిచేవారు లేక..
రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఇద్దరు టీఆర్ఎస్ అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలనలో భాగంగా బుధవారం ఎన్నికల పరిశీలకుడు చంపాలాల్, జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి అమోయ్కుమార్ ఆధ్వర్యంలో సమావేశమైన ఎన్నికల అధికారులు నామినేషన్ పత్రం అసంపూర్తిగా ఉండడంతో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ను తిరస్కరిస్తూ నిర్ణయించారు. నిర్ణీత సమయం దాటిన తర్వాత నామినేషన్ వేయడం, డిపాజిట్ డబ్బులు చెల్లించకపోవడం, నామినేషన్ను బలపరిచే వారి సంతకాలు లేకపోవడంతో స్వతంత్ర అభ్యర్థి చంద్రశేఖర్ నామినేషన్ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు.
వరుసగా రెండోసారి ఎన్నిక..
ప్రస్తుత ఎమ్మెల్సీలు పట్నం మహేందర్రెడ్డి, శంభీపూర్ రాజులు వరుసగా రెండోసారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా ఎన్నికకానున్నారు. టీఆర్ఎస్కు మెజార్టీ ఓటర్లు ఉండడం, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు దూరంగా ఉండడం, నామినేషన్ దాఖలు చేసిన స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ తిరస్కరించడంతో శంభీపూర్ రాజు, పట్నం మహేందర్రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు మూడు దఫాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగగా, వరుసగా రెండుసార్లు టీఆర్ఎస్ పార్టీ చేజిక్కించుకోవడం విశేషం.