రాష్ట్రంలో ప్రస్తుతం తూర్పు ఈశాన్యగాలులు వీస్తున్నాయని, శుక్రవారం రాత్రి నుంచే ఉత్తరాది నుంచి శీతలగాలులు ఇంకా బలంగా వీచే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ఈ చలిగాలులు ఫిబ్రవరి మొదటివారం వరకు వీస్తాయని పేర్కొన్నారు. మరో ఐదురోజులపాటు సాధారణం కన్నా రెండు, మూడు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించారు. గురువారం సంగారెడ్డి జిల్లా కోహిర్లో అత్యల్పంగా 8.9 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైనట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది. వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 9.3 డిగ్రీలు నమోదు కాగా అత్యధికంగా వనపర్తి జిల్లా కోనాయిపల్లిలో 33.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. జోగులాంబ గద్వాల జిల్లా మినహా అన్ని జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి.
మన్యంలో గజగజ..
వాజేడు, డిసెంబర్ 16: ములుగు జిల్లా వాజేడు మన్యంలో మంచు కమ్మేసింది. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ఠస్థాయికి పడిపోతుండటంతో జనం చలికి గజగజ వణుకుతున్నారు. ముఖ్యంగా వాజేడు మండలంలోని ప్రగళ్లపల్లి, మొరుమురు కాలనీ, జగన్నాథపురం తదితర గ్రామాల్లో గురువారం ప్రధాన రహదారిపై భారీగా మంచు కురవడంతో వాహనాల హెడ్ లైట్ల వెలుతురులోనే వాహనదారులు రాకపోకలు సాగించాల్సి వచ్చింది.