తెలంగాణ ప్రభుత్వం సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహిస్తే.. దానికి ఒక సార్థకత ఉండేలా కార్యక్రమాలను రూపొందించుకొన్నది. ఆదివాసీ, గిరిజనుల ఆత్మగౌరవ భవనాలను రాజధాని నడిబొడ్డులో ప్రారంభించుకొని సగర్వంగా జాతికి అంకితం చేసుకొన్నది. బ్రిటిష్వారిపై వీరోచితంగా పోరాడిన గోండు వీరుడు కుమ్రం భీంను సమున్నతంగా గౌరవించుకొని.. ఆత్మగౌరవ భవనానికి ఆయన పేరును సార్థకంగా పెట్టుకొన్నది. గిరిజనుల కోసం 10 శాతం రిజర్వేషన్లను ప్రకటించుకొన్నది. దళితబంధు మాదిరిగానే గిరిజన బంధు అమలుకూ సంకల్పించుకొన్నది.
బీజేపీ ప్రభుత్వం అధికారిక ఉత్సవం పేరుతో చేసింది ఏమిటో తెలుసా? లో జెండా ఎగరేసి, కవాతు చేసి చేతులు దులుపుకొన్నది. తెలంగాణకు ఒక్క రూపాయి ప్రకటించలేదు. కనీసం అమరవీరుల పేరుతో ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రకటించలేదు. అందుకే.. బీజేపీ నిర్వహించిన కార్యక్రమం ప్రజలకు పట్టలేదు.
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఒకవైపు సమైక్యతా జైత్రయాత్ర.. పల్లె పట్టణాల తేడాలేకుండా వెల్లువెత్తిన తెలంగాణ జనసమూహం.. యావత్ తెలంగాణ ఆకసాన రెపరెపలాడిన త్రివర్ణ పతాకం. రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య ప్రపంచంలోనికి ప్రస్థానం చేసిన తెలంగాణ వజ్రోత్సవ సంబురాలను ప్రతి గడపా ఉద్విగ్నంతో జరుపుకొన్నది. మరోవైపు స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమైక్యత, సమగ్రత అన్న మాటలకు అర్థాలే తెలియని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఉన్నట్టుండి సెప్టెంబర్ 17 గుర్తుకు వచ్చి.. సికిందరాబాద్ పరేడ్ మైదానంలో జెండా ఎగురవేసి.. సైనిక పదఘట్టనల కవాతు నిర్వహించి.. విద్వేషాల రాజగురువు కేంద్ర హోం మంత్రి చిచ్చు మాటలు మాట్లాడి.. వెళ్లిపోయారు.
తెలంగాణ ప్రభుత్వం సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహిస్తే.. దానికి ఒక సార్థకత ఉండేలా కార్యక్రమాలను రూపొందించుకొన్నది. ఆత్మగౌరవ భవనాలను రాజధాని నడిబొడ్డులో ప్రారంభించుకొని సగర్వంగా జాతికి అంకితం చేసుకొన్నది. రాచరికపు వ్యవస్థపై వీరోచితంగా పోరాడిన గోండు అమరవీరుడు కుమ్రం భీంను రాష్ట్ర యోధుడిగా గౌరవించుకొని.. ఆత్మగౌరవ భవనానికి ఆయన పేరును సార్థకంగా పెట్టుకొన్నది. గిరిజనుల కోసం 10% రిజర్వేషన్లను ప్రకటించుకొన్నది. దళితబంధు మాదిరిగానే గిరిజన బంధు అమలుకూ సంకల్పించుకొన్నది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారిక ఉత్సవం పేరుతో చేసింది ఏమిటి? పరేడ్ గ్రౌం డ్స్లో జెండా ఎగరేసి, కవాతు చేసి చేతులు దులుపుకొన్నది. ఒక అద్భుత సందర్భాన్ని వేడుకగా చేసుకుంటున్న తెలంగాణకు ఒక్క రూపా యి ప్రకటించలేదు. కనీసం తెలంగాణకు ప్రేరణ ఇచ్చిన.. ఇస్తున్న అమరవీరుల పేరుతో ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రకటించలేదు. తెలంగాణ రాష్ర్టానికి ఒక్క పైసా ఇవ్వడానికి మనసొప్పలేదు. దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ వంటి ఎందరెందరో తెలంగాణ వీరులను కూడా తలచుకోలేదు. ఆఖరుకు కార్యక్రమం నిర్వహించిన పరేడ్ మైదానంలో సర్దార్ పటేల్ బొమ్మతో పాటు వారి బొమ్మలను పెట్టుకొన్నారే తప్ప ఒక్కరంటే ఒక్క స్మరణీయులైన తెలంగాణ యోధుల బొమ్మ మచ్చుకు కూడా కనిపించలేదు. కేంద్రం నుంచి హోం మంత్రి వచ్చారు. విద్వేషపు మాటల విషం చిమ్మి వెళ్లిపోయారు. అందుకే.. బీజేపీ నిర్వహించిన కార్యక్రమం ప్రజలకు పట్టలేదు. పరేడ్కే పరిమితమైంది.
ఏ రాష్ట్రంలోనైనా ఒక కార్యక్రమం అధికారికంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకొంటే.. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడం దాని బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కానీ, కేంద్రం మాత్రం అన్ని సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంతో ఎలాంటి సంప్రదింపులు జరుపకుండానే.. సంబంధం లేకుండానే కార్యక్రమాన్ని ప్రకటించేసుకొన్నది. రక్షణశాఖకు చెందిన పరేడ్ గ్రౌండ్లో కార్యక్రమాన్ని ఏర్పాటుచేసుకొని.. నిర్వహించుకొన్నారు. దీన్ని సమాఖ్య స్ఫూర్తి అని అంటారా? అని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు. ఇది తెలంగాణపై ఢిల్లీ పెద్దల దాడిగానే భావించాల్సి ఉంటుందని మండిపడుతున్నారు.
పీడించే వర్గాలకు వ్యతిరేకంగా తెలంగాణ యావత్ సమాజం ఏకమై ఉద్యమం చేసి స్వేచ్ఛను పొంది.. భారతదేశంతో సమైక్యమైన రోజు సెప్టెంబర్ 17. ఇది కుల, మత, జాతి బేధాలు లేకుండా తెలంగాణ ప్రజలు జరిపిన పోరాటానికి, భారత సమాఖ్యలో కలిసిపోయిన అద్భుత సందర్భానికి గుర్తు. కానీ.. బీజేపీ ఈ చరిత్రకు వక్రభాష్యం చెప్పింది. ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ పేరుతో మతం రంగు పులిమే కుట్రచేసింది.
పీడించిన వర్గాలను వదిలిపెట్టి కేవలం మతాన్ని బూచిగా చూపి విషపు రాజకీయాలు చేయాలని విఫల యత్నం చేసి భంగపడ్డది. సబ్బండ వర్ణాలు, రైతులు, కూలీలు, మహిళలు, ఆదివాసీలు, గిరిజనులు, దళితులు, హిందువులు, ముస్లింలు, పార్శీలు, మరాఠాలు, కన్నడిగులు, ఇరానీలు.. ఇలా అన్ని వర్గాలవారూ ఒక్కటిగా కలిసి అద్భుతమైన పోరాటం చేసి, రాచరిక వ్యవస్థ నుంచి స్వేచ్ఛను పొందిన అపూర్వ సందర్భమిది. కేవలం తన రాజకీయ ప్రయోజనం కోసం బీజేపీ నేతలు విషపూరిత ప్రదర్శన చేసి వెళ్లిపోయారు.
మరి ఇదే కేంద్ర హోం మంత్రి.. ఇదే హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉండి.. కర్ణాటక, మహారాష్ట్రల్లో కలిసిపోయిన ప్రాంతాల్లో కానీ.. ఆ రాష్ట్ర రాజధానులైన ముంబై, బెంగళూరుల్లో కానీ ఈ కవాతులు ఎందుకు చేయలేదు? అంతెందుకు ప్రధాని, కేంద్ర హోం మంత్రి సొంత రాష్ట్రమైన గుజరాత్లోని జునాగఢ్ సంస్థానం కూడా హైదరాబాద్ కంటే కాస్త ముందు.. ఇదే పోలీసు చర్యతోనే భారతదేశంలో కలిసిపోయింది చరిత్రే కదా! మరి జునాగఢ్ విమోచన దినోత్సవాలను ఎందుకు చేయడం లేదు? అని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. ఎందుకంటే.. అక్కడ అధికారంలోకి రావడానికి బీజేపీకి మతం అక్కరకు రాలేదు కాబట్టి.
విచిత్రమేమిటంటే.. ఎక్కడో గుజరాత్నుంచి ఢిల్లీకి పోయిన ఓ వ్యక్తి.. మన దగ్గరకు వచ్చి మన చరిత్రను మనకే కొత్తగా చెప్పడం. శాతవాహనులు, చాళుక్యులు, కాకతీయులు, కుతుబ్షాహీలు, అసఫ్జాహీల దాకా మన చరిత్రను ఆయనెవరో వచ్చి మనకు చెప్పడం విడ్డూరం కాక మరేమిటి? ఇప్పుడు ఎంఐఎంను మతతత్వ పార్టీ అని, రజాకార్ల వారసత్వ పార్టీ అని పదే పదే బీజేపీ చెప్తున్నప్పుడు ఆ పార్టీపై మోదీ సర్కారు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మైకుల ముందు రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం తప్ప.. కేంద్రంలో సంపూర్ణ మెజార్టీతో అధికారంలో ఉన్న బీజేపీని చర్యలు తీసుకోవడానికి అడ్డుకొంటున్నది ఎవరు? నిజాంను దోషిగా నిందించేటట్లయితే.. సర్దార్ పటేల్ ఆయనను రాజ్ ప్రముఖ్గా ఎందుకు చేశారు? నేరగాడైనప్పుడు జైల్లో ఎందుకు వేయలేదు? హైదరాబాద్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిని నిజాం ద్వారానే ప్రమాణం ఎందుకు చేయించారు?
అరాచకమైన రాచరిక వ్యవస్థపై గెరిల్లా యుద్ధానికి నాంది పలికిన గోండు వీరుడు.. మన ప్రాంతం మన స్వపరిపాలన అన్న నినాదానికి ప్రేరణగా నిలిచిన యోధుడు. జల్.. జంగిల్.. జమీన్ నినాదంతో ఆదివాసీలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను సాధించడానికి రాచరిక సైన్యంపై యుద్ధం చేసిన ధీరుడు కుమ్రం భీంకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమున్నత గౌరవాన్ని అందించింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డులో గిరిజనుల ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించి ఆ భవనానికి కుమ్రంభీం గిరిజన ఆత్మగౌరవ భవనంగా నామకరణం చేసుకొని ఆ మహావీరుడి పేరుకు శాశ్వత కీర్తిని కలిపించింది.
తెలంగాణ విమోచన దినోత్సవం జరుపడానికి 25-30 ఏండ్ల నుంచి కృషి చేస్తున్నామని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇన్నేండ్లలో కేంద్రంలో వాజపేయి, మోదీ ప్రభుత్వాలు, ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబునాయుడుతో కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వాలు కలిపితే కనీసం 21 సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉన్నది. ఆ కాలంలో ఎందుకు నిర్వహించలేదు? ఇప్పుడు ఫెడరలిజాన్ని అవమానిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోకుండానే కార్యక్రమం నిర్వహించింది కదా!
ఇదే తరహాలో ఇన్నేండ్లు చేయొచ్చు కదా! తెలంగాణ పోరాటంలో ఉనికే లేని బీజేపీ.. సంబంధం లేని ఆరెస్సెస్ కలిసి హిందూ మహాసభ వంటి వాటిని ప్రచారం చేసుకోవడానికే ఈ కార్యక్రమం నిర్వహించిందన్నది వాస్తవం. గత 30 ఏండ్లలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి బీజేపీ నేతలు బైరాన్పల్లి వంటి తెలంగాణ ఉద్యమ చారిత్రక వేదికలకు వెళ్తూనే ఉన్నారు. పరకాలలో ఏకంగా ఒక స్తూపం కట్టించారు. మరి ఆయా ప్రాంతాల్లో బీజేపీ కనీసం వార్డ్ మెంబర్ అయినా గెలిచిందా?
ఎంత మంది సర్పంచ్లు ఉన్నారు? దీనిని బట్టి తెలంగాణ ప్రజలు బీజేపీ రాజకీయ ముసుగును గుర్తించారన్నది స్పష్టం. కేవలం ఓట్ల కోసమే చేస్తున్నదని ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. విమోచన దినోత్సవం కోసం ఎనిమిదేండ్లుగా అడుగుతున్నామని బీజేపీ నేతలు అంటున్నారు. మరి తెలంగాణ ప్రజలు ఎనిమిదేండ్లుగా.. మిషన్ కాకతీయకు నిధులు, కాళేశ్వరానికి జాతీయ హోదా, ట్రైబల్ యూనివర్సిటీ, కోచ్ ఫ్యాక్టరీ.. ఇలా ఎన్నో అడుగుతున్నారు.
మరి వాటిని ఎందుకు ఇవ్వడం లేదు?. ఒకసారి చరిత్రను గమనిస్తే విమోచన వాదాన్ని ఎత్తుకున్న బీజేపీ నేతలెవరూ ఆ తర్వాత రాజకీయాల్లో పెద్దగా కొనసాగలేదు. దీనిని బట్టి ప్రజలు దీనిని విమోచనంగా కాకుండా.. సమైక్యతా దినంగా పిలుస్తున్నారన్నది సుస్పష్టం. సీఎం కేసీఆర్ ఎవరి మనోభావాలు పట్టించుకోకుండా ఏకపక్షంగా సమైక్యతా దినోత్సవంగా ప్రకటించారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.
దీనికి సమైక్యతా దినోత్సవానికి ప్రజల నుంచి వచ్చిన స్పందనే సమాధానం. 200 ఏండ్ల బ్రిటిష్ పాలన నుంచి దేశం స్వాతంత్య్రం పొంది వజ్రోత్సవాలు జరుపుకొంటున్న వేళ.. బ్రిటన్ రాణి మరణిస్తే దేశ పతాకాన్ని అవనతం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడాన్ని ఏమనాలి? దీనిని ఏకపక్షంగా నిర్ణయించలేదా? ఎవరి మనోభావాలను పరిగణనలోకి తీసుకున్నారో బీజేపీ నేతలు చెప్పాలి.
– రావుల శ్రీధర్ రెడ్డి, విద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్