బుధవారం హైదరాబాద్లో జరిగిన ‘భీమ్లానాయక్’ చిత్ర ప్రీరిలీజ్ వేడుకకు మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు చిత్ర కథానాయకుడు పవన్కల్యాణ్ ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలియజేశారు. కళను అక్కున చేర్చుకొని అభినందించడానికి కుల, మత, భాష, ప్రాంతీయ భేదాలుండవని, భావ వైరుధ్యాలు అడ్డంకి కాబోవనే విషయాన్ని మరోమారు కేటీఆర్ తెలియజెప్పారని పవన్కల్యాణ్ కొనియాడారు. ‘అంతర్జాతీయ సదస్సులో బిల్గేట్స్తో కీలకమైన వర్చువల్ మీట్కు సన్నద్ధమవుతూ బిజీగా ఉన్నా సమయం వెసులుబాటు చేసుకొని ‘భీమ్లానాయక్’ ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంత భావ వైరుధ్యాలున్నా..రాజకీయ విమర్శలు చేసుకున్నా వాటిని కళకు, సంస్కృతికి అంటనీయకపోవడం తెలంగాణ రాజకీయ నేతల శైలిలో ఉంది. హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయగారు ప్రతి ఏటా నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమంలో అన్ని పక్షాలవారు ఆత్మీయంగా ఉండటాన్ని చూశాం. అటువంటి ఆత్మీయ త కేటీఆర్గారిలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తూ…ఈ రంగం అభివృద్ధికి ఆలోచనలను కేటీఆర్గారు చిత్తశుద్ధితో పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన సినిమాటోగ్ర ఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ వేడుక సాఫీగా సాగడానికి ఎంతో శ్రమకోర్చిన తెలంగాణ పోలీస్ యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు’ అని పవన్కల్యాణ్ ప్రకటనలో పేర్కొన్నారు.
‘భీమ్లానాయక్’ ప్రీరిలీజ్ వేడుకకు అతిథిగా హాజరుకావడం పట్ల మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ఆనందం వ్యక్తం చేశారు. ‘రోజువారి వ్యవహారాల నుంచి కాస్త విరామం తీసుకొని నా సోదరులు పవన్కల్యాణ్, రానా, తమన్, సాగర్ కె చంద్రలకు శుభాకాంక్షలు తెలియజేసినందుకు సంతోషంగా ఉంది. అలాగే అద్భుత ప్రతిభావంతులైన సంగీతకారులు పద్మశ్రీ మొగిలయ్యగారిని, శివమణిగారికి కలుసుకోవడం ఆనందంగా ఉంది’అని కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు.