లండన్: అదో తిమింగలం పిల్ల. ఎటో వెళ్లాలనుకుని ఇంకెటో వెళలిపోయింది. లండన్ నగరం మధ్య నుంచి ప్రవహించే థేమ్స్ నదిలోకి కొట్టుకు వచ్చింది. జనం జాతర కట్టారు. జంతు ప్రేమికులు, పశువైద్యులు దానిని కాపాడేందుకు మింక్ జాతికి చెందిన ఆ తిమింగలం తినే తిండి థేమ్స్ నదిలో దొరకదు. తిరిగి సముద్రంలోకి చేర్చాలన్నా అయ్యే పని కాదు. థేమ్స్ నదిలో ఒడ్డుకు దగ్గరగా వచ్చి మేటవేసిన చోట బురదలో చిక్కుకుపోయింది. దానిని కాపాడేందుకు ఇంక వేరే మార్గమేదీ కనిపించలేదు. తీవ్ర అస్వస్థతతో అలమటిస్తున్న తిమింగలం పిల్లను చివరకు చేసేదేమీ లేక విషపు ఇంజక్షన్ ఇచ్చి బాధల నుంచి శాశ్వత విముక్తి ప్రసాదించారు. ముందుగా అది ఆదివారం నాడు రిచ్మాండ్ లాక్స్ వద్ద ఇరుక్కుపోయి కనిపించింది. అతికష్టం మీద విడిపించగలిగారు. గాలినింపే పడవ మీద దానిని పడుకోబెట్టారు. కానీ అది తప్పించుకుని పోయింది. సోమవారం ఉదయం టెడ్డింగ్టన్ వద్ద కనిపించింది. తీగల్లో చిక్కుకపోయి కదల్లేని స్థితిలో ఉంది. అప్పటికే గాయాలతో అది తీవ్రమైన బాధలో ఉంది. కదలడం మానేసింది. సోమవారం సాయంత్రం పశువైద్యులు ఇచ్చిన ఇంజక్షన్తో అది శాశ్వత నిద్రలోకి జారుకుంది. ఈదురుగాలులు వీస్తున్నా, వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా రెయిలింగ్స్ పట్టుకుని చూస్తుండిపోయిన జనం బరువెక్కిన గుండెలతో నిట్టూర్పులు విడుస్తూ తమతమ ఇళ్లకు మళ్లారు. గత మార్చిలో ఒక సీల్ ఇదే తరహాలో థేమ్స్ లోకి వచ్చింది. వీధికుక్కలు దానిని పీకిపెట్టాయి. అప్పుడు కూడా పశువైద్యుల ఇంజక్షన్ ఉపయోగించాల్సి వచ్చింది. లాక్డౌన్ వల్ల బోట్లు తిరగకపోవడమే ఇలా సముద్ర జీవులు నదుల్లోకి కొట్టుకురావడానికి కారణమని అంటున్నారు.