ముషీరాబాద్, మార్చి 8: రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించినట్టుగానే కేంద్రం ఒక్కో పథకానికి తన వాటా నిధులు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలు తిరగబడక ముందే కేంద్రం లక్ష కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేపట్టాలని అన్నారు. బీసీలకు 50 శాతం రిజర్వేషన్లపై పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్చేస్తూ ఏప్రిల్ మొదటివారంలో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించనున్నట్టు చెప్పారు. మంగళవారం విద్యానగర్లోని బీసీభవన్లో నిర్వహించిన 14 బీసీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేంద్రం విద్య, ఉద్యోగ, రాజకీయరంగాల్లో జనాభా దామాషా ప్రకారం వాటా కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కంటే అదనంగా 15 వందల కోట్ల బడ్జెట్ కేటాయించడం మంచి పరిణామమని తెలిపారు. సమావేశంలో బీసీ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నాయకులు కోలా జనార్దన్, సీ రాజేందర్, జీ అనంతయ్య, కృష్ణయాదవ్, వెంకట్, ఉదయ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.