సిటీబ్యూరో, జనవరి 25 (నమస్తే తెలంగాణ): దొంగలు రూటు మార్చారు. పోలీసులకు చిక్కకుండా.. దొరక్కుండా.. గూగుల్ తల్లిని అడిగి.. కొత్త దారులు ఎంచుకుంటున్నారు. మరికొందరు ముందుగా రెక్కీ నిర్వహించి నేరాలకు పాల్పడుతున్నారు. సీసీ కెమెరాల కంట పడకుండా, చెక్ పోస్టులు, టోల్ ప్లాజాలు టచ్ కాకుండా, పోలీసుల విచారణలో దృష్టి మళ్లించేలా కొత్త ప్రణాళికలు అమలుచేస్తున్నారు. ఇటీవల గంజాయి ముఠాలు, దేవాలయాల్లో చోరీకి పాల్పడిన దొంగలు, ఇతర దొంగలను పట్టుకున్న పోలీసులు విచారణలో తెలిసిన నిజాలకు కంగుతిన్నారు. దొరకొద్దు.. దొరికినా.. ఆలస్యంగా దొరకాలి. ఆలోపు చోరీ చేసిన సొత్తును ఖతం పట్టించాలి. లేకుంటే బయటకు తరలించాలి. మొత్తానికి రికవరీ లేకుండా చూసుకుంటామని దొంగలు తెలుపడంతో ఆశ్చర్యపోవడమే పోలీసుల వంతైంది.
కారు చోరీ చేసి.. నంబరు ప్లేటు మార్చేసి..!
ఎల్బీనగర్ పీఎస్ పరిధి హస్తినాపురంలోని సంతోషిమాత దేవాలయంలో చోరీకి పాల్పడిన దొంగలు ముందుగా గంటూరులో ఓ కారును దొంగిలించారు. దానికి హై సెక్యూరిటీ నంబర్ ప్లేటు అమర్చారు. చోరీకి వచ్చే క్రమంలో విచారణలో పోలీసులను కన్ఫ్యూజ్ చేయాలని పథకం వేశారు. కారులో ఎల్బీనగర్ పరిసరాల్లోని 20 గల్లీల్లో తిప్పి ఓఆర్ఆర్ ఎక్కారు. ఆ తర్వాత మళ్లీ గల్లీలు తిరుగుతూ దేవాలయానికి చేరుకొని చోరీకి పాల్పడ్డారు. అనంతరం నేరుగా ఏపీకి వెళ్లకుండా ఆలయం పరిసరాల్లోనే మరో 20 రూట్లలో తిరుగి చివరకు గుంటూరు చేరుకున్నారు. సీసీ కెమెరాల ద్వారా దొంగలు ఉపయోగించిన కారును గుర్తించిన పోలీసులు నంబర్ ప్లేట్ ఆధారంగా రాజమండ్రిలో పట్టుకున్నారు. అసలు నిజం తెలియడంతో పోలీసులు కంగుతున్నారు. నంబర్ ప్లేట్ మార్చేసి కన్ఫ్యూజ్ చేశారని గుర్తించిన పోలీసులు చివరకు మాటువేసి అసలు దొంగలను పట్టుకున్నారు.
నేరుగా కాకుండా.. తిప్పుతూ.. తిరుగుతూ..
ఇటీవల సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఓ రియల్ వ్యాపారి ఇంట్లో చోరీ జరిగింది. సీబీఐ, ఏసీబీ అధికారులమని చెప్పి.. పట్టపగలే చోరీకి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ పుటేజీలను పరిశీలించగా.. నేరస్తులు మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లోని గల్లీల్లో చక్కర్లు కొట్టి తిరిగి ఏపీకి వెళ్లినట్లు గుర్తించారు. ఎట్టకేలకు నిందితులను అరెస్టు చేశారు.
గూగుల్ మ్యాప్ ద్వారా.. కొత్త దారులు ఎంచుకొని
గంజాయి ముఠాలపై నగర పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిందితులు హైదరాబాద్ దాటొద్దనే లక్ష్యంతో రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఏపీ నుంచి హైదరాబాద్కు చేరుకునే హై-వే మార్గంలో చెక్పోస్టులు, ప్రత్యేక చెకింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. దీంతో స్మగ్లర్లు రూటు మర్చారు. గూగుల్ మ్యాప్లో హైవే, టోల్ ప్లాజా, పోలీస్ చెక్ పోస్టులు టచ్ కాని రూట్లు, నగరానికి టచ్ కాకుండా నగరం దాటే రూట్లు వెతుక్కున్నారు. గూగుల్ చెప్పిన రూటులో గంజాయి తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు ముఠాను కొత్తూరు వద్ద పట్టుకున్నారు.