మంచిర్యాల, మే 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శనివారం నిర్వహించిన రోడ్ షో సూపర్ సక్సెస్ అయ్యింది. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, సింగరేణి కార్మికులు, ప్రజలు పెద్దసంఖ్యలో తరలిరాగా ఆ ప్రాంతం జనసంద్రమైంది. గోదావరిఖని నుంచి మంచిర్యాల జిల్లాలోకి ప్రవేశించిన బస్సుయాత్రకు ఇందారం, మంచిర్యాల ఓవర్ బ్రిడ్జి వద్ద మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. మంచిర్యాల జిల్లాలోకి ప్రవేశించడానికి ముందు గోదావరి నదీ దగ్గర బస్సు ఆపిన కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచే అశేష జనవాహిని కేసీఆర్ ఎదురువెళ్లి ఘన స్వాగతం పలికి తోడ్కొని ఐబీ చౌరస్తాకు తీసుకురావడంతో మూడు ప్రధాన రహదారులు జనంతో కిక్కిరిసిపోయాయి.
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ విప్ బాల్క సుమన్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బస్సులోకి వెళ్లి కేసీఆర్కు స్వాగతం పలికారు. బస్సు యాత్ర ఐబీ చౌరస్తాలోకి వచ్చేటప్పటికే ఇటు లక్షెట్టిపేట, అటు బెల్లంపల్లికి, చెన్నూర్ వైపు వెళ్లే రహదారులన్నీ జనంతో కిటకిటలాడాయి. మంచిర్యాల చరిత్రలోనే ఇలాంటి జనప్రవాహాన్ని చూడలేదంటూ సాక్షాత్తూ కేసీఆరే చెప్పేంతగా జనం తరలివచ్చారు. కేసీఆర్ బస్సు మీదకు రాగానే జనం సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ వారిని వారించేందుకు ప్రయత్నించినా వినకుండా కాసేపు నినాదాలు చేశారు. దాదాపు 20 నిమిషాలపాటు కేసీఆర్ మాట్లాడగా, జనం ఆసక్తిగా విన్నారు.
కేసీఆర్ నోట.. జనం మాట..
ఐదు నెలల కాంగ్రెస్ పాలనపై జనంలో ఉన్న అభిప్రాయమే కేసీఆర్ నోట ప్రతిధ్వనించింది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలవుతున్నాయా? అని కేసీఆర్ ప్రశ్నించినప్పుడు.. ప్రజలు లేదు.. లేదు అని సమాధానాలిచ్చారు. 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? రైతుబంధు అందరికీ వచ్చిం దా? మహిళలకు రూ.2500 వస్తున్నాయా? అని ప్రశ్నించినప్పుడు ప్రజలు రాలేదు.. రాలేదు అని చెప్పారు. ఆపై కేసీఆర్ చమత్కరిస్తూ.. మీరు తప్పు చెప్తున్నరు.. రూ 5వేలు వస్తున్నయట కదా.. అనగా, దానికి సమాధానంగా ప్రజలు రాలేదని చెప్పారు. జిల్లాల రద్దు విషయంలో ప్రజలు ఎంత వ్యతిరేకతతో ఉన్నారో ఈ రోడ్షోతో అర్థమైపోయింది. మంచిర్యాల జిల్లా ఉండాల్నా.. పోవాల్నా.. ఈ ముఖ్యమంత్రి జిల్లాలను తీసేస్త అంటున్నడు అని కేసీఆర్ అనగానే.. జనం జిల్లా ఉండాలని ముక్తకంఠంతో నినాదాలు చేశారు.
పెద్దపల్లిలో గెలుపు ఖాయం చేసిన కేసీఆర్..
పెద్దపల్లి పార్లమెంట్లో కొప్పుల ఈశ్వర్ బంపర్ మెజార్టీతో గెలుస్తున్నాడని కేసీఆర్ చెప్పారు. బస్సుయాత్ర మొదలైనప్పటి నుంచి బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగిందనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో పెద్దపల్లిలో ఈశ్వర్ గెలుపు ఖాయం అంటూ కేసీఆర్ చెప్పడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. పెద్దపల్లిలో ఆగర్భ శ్రీమంతుడికి.. భూగర్భ కార్మికుడికి మధ్య పోటీ ఉందని..సింగరేణిని కాపాడుకోవాలం టే కార్మికుడు గెలవాల్నా.. మరెవరు గెలవాల్నా..ఆలోచించుకోవాలంటూ కేసీఆర్ చెప్పారు. అన్ని సర్వేలు పెద్దపల్లి నియోజకవర్గంలో కొప్పుల ఈశ్వర్ గెలిచినట్లు చెప్తున్నయ్.. అంటూ కేసీఆర్ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. బస్సు యాత్రతో మంచిర్యాల నగరం మొత్తం గులాబీమమైపోయింది. ఇందారం మొదలుకొని మంచిర్యాల వరకు ఎటుచూసినా గులాబీ జెండాలు, భారీ కటౌట్లే కనిపించాయి.