పారిస్, డిసెంబర్ 7: డబ్బున్నవాళ్లు మరింత ధనవంతులుగా మారుతున్నారు. గరీబ్ ఆద్మీ మరింత పేదరికంలోకి కూరుకుపోతున్నారు. భారత్లో ఆదాయ అసమానతలు పెరిగిపోతున్నాయి. 2021 జాతీయ ఆదాయంలో ఐదో వంతు కేవలం ఒక్క శాతం మంది దగ్గరే ఉండటాన్ని చూస్తే ఈ అసమానతలు ఏస్థాయిలోకి వెళ్లాయో అర్థం చేసుకోవ చ్చు. వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్ ‘ప్రపంచ అసమానత నివేదిక-2022’లో వెల్లడించిన కఠోర వాస్తవమిది. ఆదాయం, లింగ, సామాజిక అసమానతలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్ కూడా ఉన్నదని, పేదరికం పెరుగడంతోపాటు ఉన్నతవర్గాలు మరింత సంపదను ఆర్జిస్తున్నట్టు నివేదిక పేర్కొంది.
లింగ అసమానతలు
దేశంలో లింగ అసమానతలు కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. ఆసియాలో (చైనామినహా) మహిళా కార్మికుల ఆదాయం వాటా 21 శాతం ఉండగా, భారత్లో ఇది 18 శాతమేనని తెలిపింది. గడిచిన 40 ఏండ్లలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్థిక సంస్కరణల వల్ల ఆదాయం, సంపద విషయంలో అసమానతలు మరింత పెరిగాయని నివేదిక తెలిపింది. ముఖ్యంగా పైన ఉన్న ఒక శాతం మంది భారీగా లబ్ధి పొందినట్టు వెల్లడించింది. ఇదేస్థాయిలో పేదరికం కూడా పెరిగినట్టు తెలిపింది. భారత్, చైనా వంటి దేశాల్లో ప్రైవేటు రంగం దినదినాభివృద్ధి చెందుతూ, సంపదను అర్జిస్తుండగా.. ప్రభుత్వరంగం క్రమంగా పడకేస్తున్నట్టు వివరించింది. 1980లో భారత్లో ప్రైవేటురంగం దగ్గర 290 శాతం సంపద ఉంటే, 2020నాటికి అది 560 శాతానికి పెరిగినట్టు తెలిపింది.
మరింత అధ్వానంగా ఉండొచ్చు!
దేశంలో అసమానతలు అంచనాలకు మించి పెరిగిపోయాయని, అయితే వాస్తవ గణాంకాలను దాచేస్తూ గత మూడేండ్లుగా మోదీ సర్కారు తప్పుడు లెక్కలను చూపిస్తున్నట్టు నివేదిక కుండబద్దలు కొట్టింది. ఈ కారణంగానే వివిధ వర్గాల సమాచారంతో పై గణాంకాలను వెల్లడించామని, నిజానికి దేశంలో ప్రస్తుత పరిస్థితులు మరింత అధ్వానంగా ఉండొచ్చని అభిప్రాయపడింది.