ఉద్యమ సమయంలో ఏమైతే చెప్పినమో అవన్నీ చేసి చూపించినం. తెలంగాణను ధనిక రాష్ట్రం చేసినం. దేశంలోనే అత్యధిక జీతాలు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులే తీసుకొంటున్నరు. దేశంలోనే హోంగార్డులు అత్యధిక వేతనం పొందేది మన దగ్గరే. ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు 30% అలవెన్స్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. అతి తక్కువ అప్పులున్న రాష్ట్రం తెలంగాణ. తలసరి ఆదాయంలో, జీఎస్టీపీ వృద్ధిరేటులో నంబర్వన్ స్థానంలో ఉన్నం. దేశంలోనే గొప్పని చెప్పుకొనే గుజరాత్ మనతో
పోటీ పడే పరిస్థితి ఉన్నదా? మనకంటే అన్నింటిలోనూ బలమైన, 50 ఏండ్ల చరిత్ర కలిగిన మహారాష్ట్ర, కర్ణాటక,
తమిళనాడు మనంత పురోగతి సాధించలేకపోతున్నయి. ఢంకా బజాయించి చెప్తున్నం. 24 గంటలు అన్నింటికీ క్లీన్ పవర్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ కాదా? ఏ రాష్ర్టానికైనా వెళదామా? మాట్లాడదామా? దీన్ని ఒప్పుకొనే సంస్కారం ఉండొద్దా? కొందరు వ్యక్తులు, కొన్ని పార్టీలు పనిగట్టుకుని బురద జల్లుతున్నయి. ఇంత చూసైనా బుద్ధి మారొద్దా? తెలంగాణ అభివృద్ధిని గర్వంగా చెప్పుకోవాలి. ప్లాట్ఫామ్ స్పీచులు ఇకనైనా మానుకోవాలి.
తెలంగాణకు గతంలో ముల్కీ రూల్స్ ఉండే. తెలంగాణ ప్రజలు ఉద్యమిస్తే 1919లో నిజాం రాజు ఇచ్చిన హక్కు అది. ఏపీ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ముల్కీ రూల్స్కు అనుగుణంగా పెద్దమనుషుల ఒప్పందం అని చెప్పి తర్వాత దాన్ని ఉల్లంఘించారు. ముల్కీ రూల్స్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా రాజ్యాంగ సవరణ చేసి దాన్ని కూడా కాలరాశారు. తెలంగాణకు అన్యాయం చేశారు. తెలంగాణకు నిజంగా న్యాయం జరగాలంటే.. ముల్కీ రూల్స్కు మించిన స్పిరిట్ అమలు కావాలి. అంత గొప్పగా పోవాలి. తెలంగాణ ఏపీలో కలవటం, ఉద్యమం జరగటం, తెలంగాణ ఏర్పడటం జరిగింది. తర్వాత తెలంగాణకు సంబంధించి పటిష్టమైన రాష్ట్రపతి ఉత్తర్వులు రావాలి. శాశ్వత ప్రయోజనం చేకూరాలి. అందుకే రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ చేసి క్యాబినెట్ ఆమోదం తెలిపి పంపినం. దాన్ని వాళ్లు ఏడాదిపాటు పెండింగ్లో పెట్టిన్రు. ఐఏఎస్ అధికారుల బృందం, లా సెక్రటరీ సంతోష్రెడ్డి నేతృత్వంలో ఎన్నోసార్లు అడిగినం. చివరికి రాష్ట్రపతిని, ప్రధానిని నేనే కలిసిన. అయ్యా మా సమస్య ఇది.. అర్థం చేసుకోవాలని విన్నవించిన. ఎట్టకేలకు ఆ ఉత్తర్వులు వచ్చినయ్. మన యువత నిరీక్షణకు తగిన ఫలితం లభించింది. శాశ్వత ప్రాతిపదికన తెలంగాణ యువతకు వాళ్ల ఉద్యోగాలు వాళ్లకే దక్కేటట్లు 95% లోకల్ కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించినం. నాలుగురోజులు ఆలస్యమైతే అయ్యింది కానీ.. శాశ్వతంగా ఈ సారి నుంచి ఏ ఉద్యోగం వచ్చినా తెలంగాణ యువతకే 95% ఉద్యోగాలు వస్తయి. కేవలం ఐదు శాతమే ఓపెన్ క్యాటగిరీ పెట్టినం. అందులోనూ మనవాళ్లకే మరో 3 శాతం ఉద్యోగాలు వస్తయి. అంటే మొత్తానికి వందలో 98 శాతం మన ఉద్యోగాలు మనకే దక్కుతయి.
317 జీవో అందుకే ఇచ్చినం
ఉద్యోగుల విభజన, ఆంధ్రా పంచాయితీలు వంటివన్నీ పరిష్కారం కాకుండా కొత్త ఉద్యోగాలు సాధ్యం కావు. ఉద్యోగుల భర్తీకి లైన్ క్లియర్ చేయాలని భావించినం. అందుకే 317 జీవోనిచ్చినం. కొంతమందికి, కొన్ని పార్టీలకు నెత్తిలేదు, కత్తిలేదు. న్యాయస్థానాలకు కూడా పోయిన్రు. ఫలితంగా గ్రూప్ 1, 2, 3 ఏమీ నోటిఫై చేయలేకపోయినం. మేం ఆ జీవోను కఠినంగా అమలుచేసినం. ఎక్కడోళ్లక్కడ సర్దుకొన్నరు. మ్యూచువల్ ఇచ్చేసినం. సీఎస్ పర్యవేక్షణ చేస్తున్నరు. అన్నీ అయిపోయినయ్. ఉపాధ్యాయుల ప్రమోషన్లు మాత్రమే పెండింగ్ ఉన్నదని చెప్పిన్రు. అదికూడా చేసెయ్యమని నిన్ననే సీఎస్కు ఆదేశాలిచ్చిన. ఫైనల్గా ఒక రాష్ట్రం, ఒక దేశం అద్భుతాలు ఆవిష్కరించాలంటే, గొప్ప ఫలితాలు రాబట్టాలి అంటే.. ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు సంతోషంగా హ్యాండిన్ హ్యాండ్ గొప్పగా పనిచేసినప్పుడే సత్ఫలితాలు వస్తయి. అదే చేసినం. అందుకే తెలంగాణలో గొప్ప పరిపాలన జరుగుతున్నది. అందుకే వందశాతం మంచి ఫలితాలు వచ్చినయ్.