కొత్తగూడెం సింగరేణి, ఫిబ్రవరి 22: సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) గౌరవ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. మంగళవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణిని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకులు అంబానీ, అదానీల సొంతం కానున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. సింగరేణి పరిరక్షణకు అవసరమైతే ప్రధాని మోదీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కేంద్రం తీరును మార్చుకోకపోతే ఉద్యమం చేస్తామని, దేశ ప్రజలందరూ ఉద్యమబాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.