కోల్కతా, అక్టోబర్ 25: మొక్కలకు ప్రాణం ఉందని జగదీశ్ చంద్రబోస్ కనిపెట్టాడు. ఆ మొక్కలతో సంభాషించే సాంకేతికతను సింగపూర్లోని నన్యాంగ్ వర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. మొక్కలకు ఏమైనా నోరుంటుందా.. మాట్లాడటానికి.. అన్న అనుమానం వస్తుందా? నోరు ఉండదు కానీ మొక్కల ఆకులపై విద్యుదావేశం ఉంటుంది. ఈ విద్యుదావేశాల్లో మార్పులను గమనిస్తూ.. స్పందనగా మొక్కలకు విద్యుత్ తరంగాలను పంపించడం ద్వారా వాటితో సంభాషించడం సాధ్యమేనని పరిశోధకులు చెప్తున్నారు. ఇందుకోసం శాస్త్రవేత్తలు వీనస్ ఫ్లైట్రాప్ మొక్క ఆకులపై ఒక ఎలక్ట్రోడ్ను అమర్చారు. దీనిని స్మార్ట్ ఫోన్ యాప్తో నియంత్రించేలా ఏర్పాటు చేశారు. ఈ ఎలక్ట్రోడ్ ఫోన్ నుంచి మొక్కకు, మొక్క నుంచి ఫోన్కు విద్యుత్ తరంగాలను పంపిస్తుంది. ఇలా మొక్కలోని మార్పులను అది పంపే విద్యుత్ ఆవేశం ద్వారా తెలుసుకోవచ్చు. ఇది ఒక స్టెతస్కోప్ వంటిదని పరిశోధనకు నేతృత్వం వహించిన జియాడాంగ్ చెన్ చెప్పారు. ‘స్టెతస్కోప్ సాయంతో గుండె చప్పుడు విని శరీరంలో మార్పులను ఎలా అంచనా వేస్తామో.. మొక్క విద్యుత్ ఆవేశంలో మార్పులతో దానిలోని తెగుళ్లు, పోషకాల లోపం లాంటివి తెలుసుకోవచ్చు’ అని తెలిపారు. తాజా ఆవిష్కరణతో రైతులు మొక్కలతో మాట్లాడవచ్చని, వాతావరణ మార్పులు, పురుగుల మందుల వల్ల మొక్కల్లో ఎలా నష్టం జరుగుతుందో తెలుసుకోవచ్చని చెప్పారు.