‘వికీ డోనర్’, ‘బద్లాపూర్’, ‘కాబిల్’, ‘యురి’ లాంటి చిత్రాలతో బాలీవుడ్లో ప్రతిభ గల నాయికగా పేరుతెచ్చుకుంది యామీ గౌతమ్. ఆమె ఇటీవలి సినిమా ‘ఎ థర్స్ డే’ క్రిటిక్స్తో పాటు ప్రేక్షకుల ప్రశంసలు పొందుతున్నది. ఈ చిత్రంలో ప్రైమరీ స్కూల్ టీచర్ నైనా పాత్రలో నటించింది యామీ. ఇది భావోద్వేగాలు నిండిన క్యారెక్టర్. ఈ పాత్రలో యామీ నటన అందరినీ మెప్పిస్తున్నది. నైనా లాంటి పాత్ర కోసం పదేళ్లు వేచి చూశానని చెబుతున్నదీ తార. సినిమా చూసిన తన కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఎమోషనల్ అవుతున్నారని చెప్పింది. ఈ సినిమా తర్వాత తనలో వ్యక్తిగతంగానూ మార్పు వచ్చిందంటున్న యామీ…మహిళల కోసం పనిచేసే సేవా సంస్థ తరుపున పనిచేయబోతున్నట్లు తెలిపింది. యామీ గౌతమ్ మాట్లాడుతూ…‘ఏదైనా సేవా సంస్థలో పనిచేయాలంటే సెలబ్రిటీ కానక్కర్లేదు. ప్రతి ఒక్కరూ తమకు వీలైనంత ఛారిటీ చేయాలి. కొద్ది కాలంగా మంచి ఎన్జీవోలో భాగమయ్యేందుకు చూస్తున్నాను. ఇవాళ నేనూ సేవా కార్యక్రమాల్లో భాగం కావడం సంతృప్తిగా ఉంది. మహిళల బాగు కోసం పనిచేయబోతున్నా’ అని చెప్పింది. యామీ ప్రస్తుతం అక్షయ్ కుమార్ సరసన ‘ఓ మై గాడ్ 2’ చిత్రంలో నటిస్తున్నది.