తిరువనంతపురం, అక్టోబర్ 26: కేరళలో యూనివర్సిటీల వైస్ చాన్స్లర్ల నియామకాల విషయంలో సీఎం పినరయి విజయన్ ప్రభుత్వం, గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మధ్య కొనసాగుతున్న వివాదం మరింత తీవ్రరూపం దాల్చింది. ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ తన విశ్వాసం కోల్పోయారని, ఆయనపై రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ.. బాలగోపాల్ను మంత్రివర్గం నుంచి తొలగించాలని అర్థం వచ్చేలా సూచిస్తూ సీఎం విజయన్కు గవర్నర్ బుధవారం ఓ లేఖ రాశారు. ఓ యూనివర్సిటీలో ప్రసంగం సందర్భంగా బాలగోపాల్ చేసిన వ్యాఖ్యలు మంత్రిగా ఆయన చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించేలా ఉన్నాయని, దేశ ఐక్యత, సమగ్రతను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు.
అయితే గవర్నర్ డిమాండ్ను సీఎం విజయన్ తోసిపుచ్చారు. మంత్రి బాలగోపాల్పై తనకు అచంచలమైన విశ్వాసం ఉన్నదని, ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని గవర్నర్కు బదులుగా రాసిన లేఖలో స్పష్టం చేశారు. క్యాబినెట్లో మంత్రిగా కొనసాగేందుకు గవర్నర్ వ్యక్తిగత విశ్వాసం అవసరం లేదని స్పష్టం చేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రాజ్యాంగ నిబంధనలను, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం గవర్నర్ విశ్వాసం అనేది వ్యక్తిగతంగా ఉండకూడదని, మంత్రి తొలగింపు వ్యక్తిగత చాయిస్ కాదని అధికార సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ పేర్కొన్నారు. కాగా, విజయన్కు రాసిన లేఖలో మంత్రి బాలగోపాల్ను క్యాబినెట్ నుంచి తొలగించాలని గవర్నర్ స్పష్టంగా కోరనప్పటికీ, ఆయన లేఖ సారాంశం మాత్రం అదేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా, గవర్నర్కు వ్యతిరేకంగా అధికార సీపీఎం నిరసనలు చేపట్టింది.
ఈనెల 18న కేరళ యూనివర్సిటీ కార్యవట్టోమ్ క్యాంపస్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగం సందర్భంగా మంత్రి బాలగోపాల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని గవర్నర్ తన లేఖలో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు కేరళలోని యూనివర్సిటీల్లో పరిస్థితులను అర్ధం చేసుకోలేరంటూ ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టేలా, జాతీయవాద భావనకు వ్యతిరేకంగా మాట్లాడారని పేర్కొంటూ పలు వార్తాకథనాలను ప్రస్తావించారు. ఆ వ్యాఖ్యలు గవర్నర్ను లక్ష్యంగా చేశారని స్పష్టంగా తెలుస్తున్నదని, రాజ్భవన్ ప్రతిష్టను తక్కువ చేసేలా మాట్లాడారని ఆరోపించారు.
ఆర్థిక మంత్రి బాలగోపాల్పై రాజ్యాంగబద్ధమైన చర్యలు తీసుకోవాలంటూ సీఎం విజయన్కు గవర్నర్ ఆరిఫ్ఖాన్ లేఖ రాయడంపై అధికార సీపీఎంతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా స్పందించాయి. బీజేపీ ఆరెస్సెస్ ఎజెండాను అమలు చేసేందుకు గవర్నర్ ప్రయత్నిస్తున్నారని సీపీఎం ఆరోపించింది. రాజ్యాంగ, చట్టబద్ధమైన నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని కోరింది. మంత్రిని తొలగించాలన్న గవర్నర్ డిమాండును ధిక్కారంతో విస్మరించాలని కాంగ్రెస్ పేర్కొన్నది.