న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ..మార్కెట్లోకి సరికొత్త బాలెనోను పరిచయం చేసంది. ప్రీమియం హ్యాచ్బ్యాక్ బాలెనో రూ.6.35 లక్షలు మొదలుకొని రూ.9.49 లక్షల గరిష్ఠ స్థాయిలో ఈ కారు లభించనున్నది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. వీటిలో మాన్యువల్ వెర్షన్ రూ.6.35 లక్షల నుంచి రూ.8.99 లక్షల మధ్యలోనూ, ఆటోమేటిక్ రకం రూ.7.69 లక్షల నుంచి రూ.9.49 లక్షల లోపు ధరల్లో లభించనున్నాయి. కే-సిరీస్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్తో ఈ కారును రూపొందించింది. ఈ సందర్భంగా ఎంఎస్ఐ ఎండీ, సీఈవో కెనిచి అయుకవా మాట్లాడుతూ..నూతన బాలెనోను అభివృద్ధి చేయడానికి రూ.1,150 కోట్ల నిధులు వెచ్చించినట్టు చెప్పారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్పై ప్రత్యేక దృష్టి సారించడానికి, ప్రీమియం హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్కు చెందిన ఈ మోడల్లో భద్రత ప్రమాణాలు మెరుగుపరిచినట్టు, ముఖ్యంగా సరికొత్తగా డిజైన్ చేసినట్లు చెప్పారు. ఆరు ఎయిర్బ్యాగ్ కలిగిన ఈ మోడల్ మాన్యువల్ వెర్షన్ 22.3 కిలోమీటర్లు, ఆటోమేటిక్ వెర్షన్ 22.9 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది. ఇప్పటి వరకు ఈ మోడల్ కోసం 25 వేల బుకింగ్లు వచ్చాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.